నవజాత శిశువు మృతి
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కొత్తగూడెం జిల్లా రామవరం మాతా శిశు కేంద్రంలో నవజాత ఆడశిశువు మృతి చెందడం కలకలం రేపింది. రామవరంలోని మాతా శిశు కేంద్రంలో నవజాత ఆడశిశువు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే ములకలపల్లి గ్రామానికి చెందిన విజయలక్ష్మి ప్రసవం కోసం ఆసుపత్రికి రాగా ఆడశిశువుకు జన్మనిచ్చింది. అనంతరం శిశువుకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి, సకాలంలో వైద్య సేవలు అందలేదని దీంతో నవజాత శిశువు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అయితే ఘటన జరిగిన సమయంలో విధుల్లో ఉన్న డ్యూటీ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో, మరో వైద్యుడిని వివరణ కోరగా.. శిశువు పాలు తాగిన అనంతరం మిల్క్ ఆస్పిరేషన్ కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి మృతి చెందినట్లు తెలిపారు. పాలు తాగిన తర్వాత నవజాత శిశువును తల్లి సంరక్షణలో ఉంచుతూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందనీ వివరించారు.






