28 July, 2026 | 10:15 PM

ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్న వీఐ బిజినెస్

28-07-2026 09:27 PM

అమరావతి, జూలై 28 ః

ప్రముఖ టెలికాం ఆపరేటర్ వీఐ ఎంటర్‌ప్రైజ్ విభాగమైన వీఐ  బిజినెస్, ఆంధ్రప్రదేశ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈల కోసం ఒక ముఖ్యమైన డిజిటల్ సాధికారత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది. దీని వల్ల 'రెడీ ఫర్ నెక్స్ట్ కార్యక్రమం ద్వారా లక్షకు పైగా సంస్థలను డిజిటల్‌గా శక్తివంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ భాగస్వామ్యం ఏపీ ప్రభుత్వం నిర్దేశించుకున్న డిజిటల్ సాధికారత మరియు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగల ఎంఎస్ఎంఈ వ్యవస్థను నిర్మించాలనే లక్ష్యానికి అనుగుణంగా ఉంది.

ఈ కార్యక్రమం ద్వారా, వీఐ బిజినెస్ తన 'రెడీ ఫర్ నెక్స్ట్' డిజిటల్ అసెస్‌మెంట్ ప్లాట్‌ఫారమ్, విద్యా వనరులు, వర్క్‌షాప్‌లు మరియు అవగాహన కార్యక్రమాల ద్వారా మహిళా నేతృత్వంలోని సంస్థలు, స్టార్టప్‌లు, గ్రామీణ సంస్థలు మరియు తయారీ రంగ ఎంఎస్ఎంఈలలో డిజిటల్ సన్నద్ధతను ప్రోత్సహిస్తుంది. ఎంటర్‌ప్రైజ్ మొబిలిటీ, క్లౌడ్ సర్వీసెస్, సైబర్‌ సెక్యూరిటీ, కనెక్టివిటీ, ఐఓటీ  మరియు వ్యాపార ఉత్పాదకత పరిష్కారాల గురించి కూడా ఈ ప్రోగ్రామ్ అవగాహన కల్పిస్తుంది. తద్వారా సంస్థలు తమ డిజిటల్ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడానికి, తమ డిజిటల్ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడానికి మరియు వృద్ధి కోసం కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వీలు కలుగుతుంది.

భారతదేశ జీడీపీలో దాదాపు 31 శాతం వాటాను కలిగి ఉన్న ఎంఎస్ఎంఈలు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన మూలస్తంభాలుగా ఉన్నాయి. కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, భారత్‌లో 7.47 కోట్లకు పైగా ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ 42.1 లక్షలకు పైగా సంస్థలతో దేశంలోని అగ్రగామి ఎంఎస్ఎంఈ కేంద్రాలలో ఒకటిగా ఎదుగుతోంది. సంస్థలు పోటీని తట్టుకోవడానికి డిజిటల్ సాంకేతికతను ఎక్కువగా స్వీకరిస్తున్న నేపథ్యంలో, ఈ రంగాన్ని తదుపరి వృద్ధి దశకు తీసుకెళ్లడానికి డిజిటల్ సన్నద్ధతను మరియు సాంకేతికతను పెంచే కార్యక్రమాలు ఎంతో కీలకంగా మారాయి.

ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక వినియోగం ఆశాజనకమైన పురోగతిని సాధిస్తున్న సమయంలోనే ఈ భాగస్వామ్యం కుదిరింది.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఈ భాగస్వామ్యంపై Vi చీఫ్ ఎంటర్‌ప్రైజ్ బిజినెస్ ఆఫీసర్, ఎం.పి.సునీల్ కుమార్ మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఎంఎస్ఎంఈ లు ఇంజిన్ వంటివి, దేశ జీడీపీకి ఇవి దాదాపు 31 శాతం దోహదపడుతున్నాయి. దేశంలోని అతిపెద్ద MSME వ్యవస్థలలో ఒకటిగా, భారతదేశ పారిశ్రామిక మరియు ఆర్థిక వృద్ధికి ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోంది. డిజిటల్ సాంకేతికతల శక్తిని ఎంఎస్ఎంఈలు అందిపుచ్చుకునేలా చేయడం ద్వారా ఈ వృద్ధిని బలోపేతం చేయడానికి వీఐ బిజినెస్ కట్టుబడి ఉందన్నారు.