25 August, 2026 | 5:17 PM

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలి

25-08-2026 04:39 PM

మెగా ప్లాంటేషన్ లో భాగంగా 50 వేల మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభం

గంభీరావుపేట, ఆగస్టు 25( విజయ క్రాంతి): పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ మొక్కలు నాటి,సంరక్షించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు. అటవీ శాఖ ఆద్వర్యంలో గంభీరావుపేట మండలం గోరంటాల బీట్ పరిధి గజ సింగవరం శివారులో మంగళవారం వన మహోత్సవం కింద మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై మొక్కలు నాటి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. అడవులను అందరూ సంరక్షించాలని పిలుపు నిచ్చారు. దీంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమని తెలిపారు. అడవులతోనే వర్షాలు కురుస్తాయని వివరించారు. అటవీ విస్తీర్ణం తగ్గడంతో వన్యప్రాణులు, పక్షుల మనుగడకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వన్యప్రాణులు ఇండ్లలోకి వస్తున్నాయని పేర్కొన్నారు. 


ప్లాస్టిక్ కవర్లు వాడటంతో పర్యావరణ ఇబ్బందులు వస్తున్నాయని, అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. మార్కెట్, షాపుకి వెళ్లినప్పుడు బట్ట సంచితో వెళ్లాలని తెలిపారు. ప్రతి ఇంట్లో, అన్ని ఫంక్షన్లలో స్టీల్ ప్లేట్లు, గ్లాసులు వాడాలని పిలుపు నిచ్చారు.కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కొమురిశెట్టి విజయ, సర్పంచ్ లతిక, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, మిషన్ భగీరథ ఈఈలు అన్వర్, సుమలత, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, ఎంపీడీఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు