కురిసిన వాన.. మురిసిన రైతన్న
వరుణ తాండవంతో రైతు కళ్లలో ఆనందం
ఎండిపోయిన పొలాలకు పునర్జీవం
అన్నదాతల్లో వెల్లివిరిసిన సంతోషం
సింగరేణి, సెప్టెంబర్ 12: సింగరేణి మండలంలో వరుణ తాండవంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. గత కొంతకాలంగా వర్షాలు లేక ఎండిపోయిన పొలాలకు తాజా వర్షాలతో పునర్జీవం లభించింది. పంటలు వాడిపోతున్న తరుణంలో కురిసిన వర్షం అన్నదాతలకు ఎంతోఊరటనిచ్చింది.మండలంలోని పలు గ్రామాల్లో వర్షం కురవడంతో పొలాల్లోకి నీరు చేరింది. దీంతో పంటలకు అవసరమైన తేమ అందడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేస్తున్న రైతులకు ఈ వర్షం ఎంతో ప్రయోజనకరంగా మారింది.ఇటీవల వర్షాభావ పరిస్థితులతో ఆందోళనకు గురైన రైతులు.. తాజా వర్షాలతో పంటలు కోలుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోజులు ఇదే విధంగా వర్షాలు కురిస్తే పంటలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని రైతులు పేర్కొంటున్నారు.