14 August, 2026 | 8:32 PM

Breaking News

విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన

14-08-2026 07:58 PM

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రజలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలి

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రజలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోల్ల యాదగిరి ఉన్నారు. ఘట్కేసర్ డివిజన్ పరిధిలోని కొండాపూర్ ప్రాథమిక పాఠశాలలో స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సంస్కృతి ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల ఎన్‌ఎస్‌ఎస్ విభాగం విద్యార్థుల సహకారంతో  స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈకార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పాఠశాల పరిసరాలను పరిశుభ్రం చేస్తూ, విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోల్ల యాదగిరి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రజలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మన బడి – మన బాధ్యత కార్యక్రమం ద్వారా పాఠశాలలను దశల వారిగా విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా పాఠశాలలను తీర్చిదిద్దడంతో పాటు విద్యార్థుల్లో విద్యా నైపుణ్యతలు, సామాజిక బాధ్యతను పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు.

స్ఫూర్తి ఆర్గనైజేషన్ చేపడుతున్న మన బడులు మన బాధ్యత కార్యక్రమం ద్వారా ఎక్కడికక్కడ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులను, ప్రజలను భాగస్వామ్యం చేసి దశల వారిగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంతో పాటు, పలు రంగాలలో నైపుణ్యాలు పెంపొందించే విధమైన కార్యచరణతో ముందుకు సాగుతుందని, బడుల బలోపేతానికి సహకరించే దాతలకు ఆదాయ పన్ను శాఖ నుండి పన్ను మినహాయింపు ఉంటుందని, దాతలు, పూర్వ విద్యార్థులు చదుకున్న పాఠశాల అభివృద్ధి కి చొరవ తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దాసు, సంస్కృతి విద్యాసంస్థల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ హరిప్రసాద్, అనిల్, ఉపాధ్యాయులు, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు  పాల్గొన్నారు.