calender_icon.png 5 July, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమలసారథిగా అతివ!

05-07-2025 12:27:07 AM

జోరుగా ఊహాగానాలు

 రేసులో ముగ్గురు మహిళా నేతలు

 రాష్ట్రాల్లో కొనసాగుతున్న సంస్థాగత ఎన్నికలు

న్యూఢిల్లీ: భారతీయ జనతాపార్టీకి ప్రస్తుతం జేపీ నడ్డా జాతీయాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. వరుసగా రెండో సారి ఆయన ఈ పదవిని చేపట్టి.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించారు. జేపీ నడ్డా వారసుల కోసం పార్టీ తీవ్రంగా అన్వేషణ ప్రారంభించింది. ఇందుకోసం దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సమర్ధులైన నాయకుల కోసం కాషాయ నేతలు తీవ్రంగా జల్లెడ పట్టారు. జాతీయ అధ్యక్షుడిని నియమించేందుకు దేశంలోని సగం కంటే ఎక్కువ రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేసి ఉండాలనే బీజేపీ నిబంధనల మేరకు ఇప్పటికే 16 రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను ఖరారు చేశారు.

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మహిళలను ముఖ్యమంత్రులుగా చేసిన బీజేపీ ఈ సారి అధ్యక్ష పీఠంపై కూడా మహిళనే కూర్చోబెట్టనుందని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీకి చెందిన ఎంపీ పురందేశ్వరి, తమిళనాడుకు చెందిన జాతీయ మహిళ మోర్చా అధ్యక్షురాలు వానతీ శ్రీనివాస్‌ల పేరు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మహిళా సాధికారతకు మరింత ఊతమిచ్చేందుకు బీజేపీ అధిష్టానం మహిళను పార్టీకి జాతీయ అధ్యక్షురాలిగా చేయాలని చూస్తున్నట్టు వినికిడి. 

నిర్మలా సీతారామన్

బీజేపీలో ఉన్న మహిళల్లో నిర్మలమ్మ మొదటి వరుసలో ఉంటారు. 2019 నుంచి నేటి వరకు ఆమె దేశ ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు. తమిళనాడులో జన్మించిన నిర్మలమ్మ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పరకాల ప్రభాకర్‌ను వివాహం చేసుకుంది. దేశంలో పూర్తి స్థాయి తొలి ఆర్థిక మంత్రిగా రికార్డులకెక్కిన నిర్మలమ్మకు జాతీయ పగ్గాలు ఇస్తే పార్టీని మరో స్థాయికి తీసుకెళ్లుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 

పురందేశ్వరి

ముఖ్యమంత్రి కూతురు అయిన పురందేశ్వరి ఉమ్మడి ఏపీలో జన్మించారు. కొద్ది రోజుల పాటు కాంగ్రెస్‌లో కొనసాగిన పురందేశ్వరి.. రాష్ట్ర విభజన అనంతరం కాషాయ కండువా కప్పుకున్నారు. 2024లో జరిగిన ఎన్నికల్లో ఆమె బీజేపీ తరఫున రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచి సత్తా చాటారు. పురందేశ్వరికి కూడా అధ్యక్ష పగ్గాలు అందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పురందేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా మొన్నటి వరకు సేవలందించారు. ఇటీవల కేంద్రం ఏర్పాటు చేసిన ఏడు అఖిలపక్ష బృందాల్లోని ఓ బృందానికి పురందేశ్వరి ప్రాతినిధ్యం వహించారు. 

వానతీ శ్రీనివాసన్

తమిళనాడుకు చెందిన ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ ప్రస్తుతం బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. 1983లో బీజేపీ తీర్థం పుచ్చుకున్న శ్రీనివాసన్ అంచెలంచెలుగా ఎదిగారు. 2021 ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత, సినీనటుడు కమల్‌హసన్‌ను ఓడించి శ్రీనివాసన్ కోయంబత్తూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. శ్రీనివాసన్ కూడా బీజేపీ జాతీయ అధ్యక్షురాలి పదవికి ముందు వరుసలో ఉన్నారు. మరి ఈ ముగ్గురిలో అధ్యక్షురాలిగా ఎవరు ఎంపికైనా కానీ ఇన్నేండ్ల బీజేపీ పార్టీకి తొలి మహిళా జాతీయ అధ్యక్షురాలుగా నిలవడం ఖాయం.