9 May, 2026 | 12:21 PM

“Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల

09-05-2026 11:50 AM

హైదరాబాద్: 16 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌లో గడిపిన భారత్ రాష్ట్ర సమితి(Bharat Rashtra Samithi) పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్(BRS leader Manne Krishank released) శనివారంనాడు కందిలోని సంగారెడ్డి కేంద్ర కారాగారం నుండి విడుదలయ్యారు. విడుదలైన అనంతరం, "Back to Question" (ప్రశ్నించడానికి తిరిగి వచ్చాను) అనే నినాదం ఉన్న టీ-షర్ట్‌ను ధరించి క్రిశాంక్  మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. 

అంగన్‌వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు, రాఘవ కన్స్ట్రక్షన్స్‌కు సంబంధించిన మైనింగ్ కార్యకలాపాలలో జరిగిన అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు, వ్యాఖ్యలు చేసినందుకు క్రిశాంక్‌ను అరెస్టు చేశారు. విలేకరులతో మాట్లాడుతూ, తన పక్షాన నిలబడి, తాను నిరంతర న్యాయ పోరాటంగా అభివర్ణించిన పోరాటాన్ని తన తరపున సాగించినందుకు BRS పార్టీ నాయకత్వానికి,పార్టీ న్యాయ బృందానికి క్రిశాంక్ కృతజ్ఞతలు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల పైన ప్రశ్నించే ప్రతిపక్షాలపై కాకుండా ఇప్పటికైనా శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులను, సోషల్ మీడియాలో ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకుంటోందని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్రంలో గాడితప్పిన లా అండ్ ఆర్డర్ మీద ఫోకస్ పెట్టండి, ప్రతిపక్షాల మీద కాదని సూచించారు.