2 May, 2026 | 1:05 PM

రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు

02-05-2026 11:51 AM

చండీగఢ్: ఇటీవల బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సందీప్ పాఠక్‌పై(Rajya Sabha MP Sandeep Pathak) పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది అని శనివారం వర్గాలు తెలిపాయి. పాఠక్‌పై బెయిల్ లభించని సెక్షన్ల కింద రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు వారు తెలిపారు. FIRలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీని వీడి, భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరిన ఏడుగురు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీలలో పాఠక్ ఒకరు.

పాఠక్ అధికారిక నివాసం వెలుపల భద్రతను కట్టుదిట్టం చేస్తున్న దృశ్యాలు వీడియోల్లో కనిపించగా, మరొక వీడియోలో ఆయన ఇంటి వెనుక ద్వారం గుండా బయటకు వచ్చి, కారులో కూర్చుని అక్కడి నుండి వెళ్లిపోవడం కనిపించింది. ఈ 'ఆప్' (AAP) తిరుగుబాటు నాయకుడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడిందని, ఆయన ప్రస్తుతం ఒక రహస్య ప్రదేశానికి వెళ్లిపోయారని విశ్వసనీయ వర్గాలు మీడియాకి తెలిపాయి. మరోవైపు, ఆయనకు ఉపశమనం కల్పించేందుకు బీజేపీ తన న్యాయ విభాగాన్ని రంగంలోకి దించింది. 

గత నెలలో పార్టీ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఆప్ (AAP) రాజ్యసభ సభ్యులలో రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, క్రికెటర్ హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, స్వాతి మాలివాల్, విక్రమ్‌జిత్ సాహ్నీ ఉన్నారు. మాలివాల్ మినహా, మిగిలిన ఆరుగురు ఎగువ సభలో పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పది మంది ఆప్ రాజ్యసభ ఎంపీలలో ఏడుగురు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఒకేసారి పార్టీ ఫిరాయించినందున, సాధారణంగా ఫిరాయింపుల నిరోధక చట్టంగా పిలువబడే రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం వారిలో ఎవరూ అనర్హతకు గురయ్యే అవకాశం లేదని తెలుస్తోంది..