డిజిటల్ అరెస్ట్ ముఠాలపై ఉక్కుపాదం.. 16 రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు
200కు పైగా డిజిటల్ అరెస్ట్ మోసాలు
డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదం..
న్యూఢిల్లీ: డిజిటల్ అరెస్ట్ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేర ముఠాలపై ఉక్కుపాదం మోపుతూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (Central Bureau of Investigation) ఆపరేషన్ చక్ర-VIలో భాగంగా 60 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, 16 రాష్ట్రాల్లోని 80కి పైగా ప్రాంతాల్లో సమన్వయంతో కూడిన సోదాలు నిర్వహించింది. 'డిజిటల్ అరెస్ట్' మోసాలకు సంబంధించిన 200కు పైగా కేసుల్లో ప్రమేయం ఉన్న ఒక వ్యవస్థీకృత నెట్వర్క్ను ఛేదించే లక్ష్యంతో జరుగుతున్న దర్యాప్తులో భాగంగా పంజాబ్, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, పశ్చిమ బెంగాల్, మణిపూర్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో ఈ సోదాలు జరిగాయి.
ఈ ఆపరేషన్లో భాగంగా, షెల్ కంపెనీల ఏర్పాటు, మ్యూల్ బ్యాంక్ ఖాతాల ప్రారంభం, నిర్వహణలో ప్రమేయం ఉన్నారనే ఆరోపణలపై చెన్నైకి చెందిన బి. నరేష్, కోల్కతాకు చెందిన సంజీబ్ సాహా అనే ఇద్దరు వ్యక్తులను సీబీఐ అరెస్టు చేసింది. నిందితులను అరెస్టు చేయడంతో ఈ ఆపరేషన్ ముగిసిందని అధికారులు తెలిపారు. నిందితులు సంపాదించిన సుమారు రూ. 2 కోట్ల సొమ్మును మనీలాండరింగ్ చేయడానికి ఉపయోగించినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు.






