దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలు కీలక పాత్ర
- పొలాలకు సైతం సోలార్ సీసీ నిఘా
- హుజూర్ నగర్ సిఐ చరమంద రాజు
గరిడేపల్లి,మే 3 : పంట పొలాల్లో దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు హుజూర్నగర్ సీఐ చరమందరాజు తెలిపారు.ఆదివారం మండలంలోని అప్పన్నపేట గ్రామంలో కీతవారిగూడెం శివారులో ఉన్న బృందావన్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్ తో కలిసి ఆయన పరిశీలించారు. ఇటీవల కీతవారిగూడెం, అప్పన్నపేట గ్రామం లో శివారులో పంట పొలాల్లో రైతులకు సంబంధించిన మోటర్లు, కేబుల్ వైర్లు దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టే భాగంలో ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రాత్రి వేళ పంట పొలాల్లో యంత్ర పరికరాలు,మోటార్లు,స్టార్టర్ల దొంగతనాలతో బెంబేలెత్తిపోతున్న అన్నదాతలకు సాంకేతికత అండగా నిలిచింది.వరుస దొంగత నాలను అరికట్టేందుకు నేతృత్వంలో పోలీసులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.వ్యవసాయ క్షేత్రాల్లో సొంత ఖర్చులతో ప్రత్యేక సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి రైతులకు భరోసా కల్పించారు.వ్యవసాయ క్షేత్రాల్లో ఈ వ్యవస్థ పనితీరును సీఐ స్వయంగా రైతులకు వివరించారు.
దొంగతనాల భయంతో రాత్రంతా పొలాల వద్దే జాగారం చేయాల్సిన అవసరం ఇకపై ఉండదని ఆయన పేర్కొన్నారు.పోలీసుల చొరవతో ఏర్పాటు చేసిన ఈ సాంకేతిక నిఘాపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇతర ప్రాంతాల్లోని రైతులు కూడా తమ పొలాల్లో ఇలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆస్తి నష్టాన్ని నివారించుకోవచ్చని ఈ సీసీ కెమెరాలు సోలార్ ద్వారా పనిచేసే విధంగా ఏర్పాటు చేసినట్లు సీఐ రైతులకు వివరించారు.వ్యవసాయానికి సంబంధించిన మోటర్లు,కేబుల్ వైర్, ట్రాక్టర్ వీల్స్, ట్రాక్టర్ కు సంబంధించిన గొర్రు, కల్టివేటర్లు లాంటి వస్తువులకు భద్రత కల్పించేందుకుగాను ఈ సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని ఆయన వివరించారు.స్థానికుల సహకారంతో దొంగతనాలను అరికట్టేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పోలంపల్లి ఆనంద్ బాబు,పిడమర్తి అంజి, పలువురు రైతుల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






