వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇవ్వాలి
సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలి: తిమ్మిడి హనుమంతరావు
తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 13 (విజయ క్రాంతి): తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం(Thippareddigudem) విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐయూకేఎంఎస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు మాట్లాడుతూ వ్యవసాయానికి నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
తరచూ విద్యుత్ కోతలతో బావులు, బోర్ల ద్వారా పంటలు సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధుల నివారణకు బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు పారిశుధ్య చర్యలు చేపట్టి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ మండల కార్యదర్శి సోమనపల్లి వెంకటేశ్వర్లు, ఏఐయూకేఎస్ మండల అధ్యక్షుడు మండల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.