27 June, 2026 | 9:52 PM

ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

27-06-2026 08:41 PM

వనపర్తి టౌన్: అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదేళ్ల లోపు వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లాలో జూన్ 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన అవగాహన ర్యాలీని శనివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్యా నాయక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పల్స్ పోలియో వ్యాధి దేశంలో చాలా సంవత్సరాల క్రితమే నిర్మూలన అయినప్పటికీ, పొరుగు దేశాల నుంచి వచ్చే వలసదారుల కారణంగా మళ్లీ వ్యాప్తి చెందే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు.

అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదేళ్ల లోపు వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, దీనివల్ల ఎలాంటి హాని ఉండదని తెలిపారు. జిల్లాలో గుర్తించిన 46,150 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి 343 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి, దాదాపు 1,300 మంది వైద్య, ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అలాగే ప్రజలు, ప్రజాప్రతినిధులు, పత్రికా మిత్రులు అందరూ సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.