రైతులు సాగునీటి విడుదలను సద్వినియోగం చేసుకోవాలి
- 8వ విడతగా ఏప్రిల్ 15 నుండి 5 రోజుల పాటు నీటి సరఫరా
జిల్లా నీటిపారుదల శాఖ అధికారి శ్రీనివాస్
పెద్దపల్లి, ఏప్రిల్ 15(విజయక్రాంతి)తెలంగాణ ప్రభుత్వ నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు, పెద్దపల్లి జిల్లా పరిధిలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కాకతీయ కాలువ ద్వారా డి-83, డి-86 కాలువలకు సాగునీటిని విడుదల చేసినట్లు జిల్లా నీటిపారుదల శాఖ అధికారి శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
యాసంగి సీజన్కు సంబంధించి ఇది చివరి విడత 8వ విడత నీటి విడుదల ఏప్రిల్ 15 నుండి వరుసగా 5 రోజుల పాటు సాగునీరు అందిస్తామని, వివిధ మండలాల రైతుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, ముఖ్యంగా మొక్కజొన్న , ఆలస్యంగా వేసిన వరి పంటలను కాపాడేందుకు ఈ తడిని విడుదల చేయడం జరుగుతుందని, మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు,చీఫ్ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు, రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీ హర్ష రైతుల అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, నీటి విడుదల కోసం ప్రత్యేక కృషి చేశారని తెలిపారు.
సాగునీరు కాలువల చివరి ఆయకట్టు వరకు చేరేలా ఇరిగేషన్ శాఖ సిబ్బంది నిరంతరం విధుల్లో ఉంటారని, నీటి పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షక ఇంజనీర్ ఇరిగేషన్ సర్కిల్, పెద్దపల్లి జిల్లా ఇరిగేషన్ అధికారి సమన్వయం చేసుకుంటూ,కాలువల ద్వారా విడుదల చేసిన నీటిని రైతులు పొదుపుగా, క్రమ పద్ధతిలో తమ పొలాలకు ఉపయోగించుకోవాలని, నీటి విడుదల సమయంలో క్షేత్రస్థాయి సిబ్బందికి రైతులు పూర్తిస్థాయిలో సహకరించి, పంటలను సమృద్ధిగా పండించుకోవాలని జిల్లా నీటిపారుదల శాఖ అధికారి శ్రీనివాస్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.






