13 March, 2026 | 8:22 AM

పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి

13-03-2026 12:32 AM

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

హనుమకొండ టౌన్, మార్చి 12 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లాలో పశువులను గాలికుంటు వైరస్ వ్యాధి నుంచి రక్షించేందుకు ప్రతి రైతు తమ పశువులకు ఉచితంగా టీకాలు వేయించుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయ్ తెలిపారు. గురువారం హనుమకొండ జిల్లా వడ్డేపల్లి ప్రాథమిక పశువైద్య కేంద్రంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు 2019 నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి పశువులకు టీకాలు వేయడం జరుగుతోందన్నారు. అన్ని పశువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించడం ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. రైతులు తమ పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పాలు అధికంగా రావాలనే ఉద్దేశంతో తెలియని ఇంజెక్షన్లు ఇవ్వకుండా జాగ్రత్తపడాలని సూచించారు. స్వచ్ఛమైన పాలను ఉత్పత్తి చేసేలా పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు గోడపత్రికలు, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. ప్రతి గ్రామంలో గోడలకు గోడపత్రికలను అంటించి, కరపత్రాలను రైతులకు పంపిణీ చేసి టీకాల కార్యక్రమంపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. మార్చి 10 నుండి ఏప్రిల్ 9 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో పశువైద్య సిబ్బంది పశువులకు ఉచితంగా టీకాలు వేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్య పశుసంవర్ధక శాఖ అధికారులు డాక్టర్ రాధాకృష్ణ, డాక్టర్ సత్యరెడ్డి, వడ్డేపల్లి పశువైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఇతర పశువైద్య అధికారులు, సిబ్బంది, రైతులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.