7 July, 2026 | 11:44 AM

మహారాష్ట్రలో వర్షబీభత్సం.. 24 గంటల్లో 67 సెం.మీ వాన

07-07-2026 10:54 AM

ముంబై: భారీ వర్షాలు మహారాష్ట్రను(Maharashtra rains) ముంచెతున్నాయి. పూణే -ముంబై( Mumbai-Pune) మధ్య ఉన్న ప్రముఖ హిల్ స్టేషన్ అయిన లోనావాలాలో 24 గంటల్లో 67 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం లోనావాలో కుంభవృష్టి కురుస్తోంది. ముంబయి- పుణె రైలు మార్గంలో(Mumbai-Pune railway route) పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.పుణె జిల్లాలో 22 చోట్ల కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. ముంబయి-పుణె మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సెంట్రల్ రైల్వే(Central Railway) అనేక చోట్ల ధ్వంసమైన రైల్వే ట్రాక్ లకు మరమ్మతులు చేస్తోంది. దౌండ్ తాలూకాలో భీమా నది(Bhima River) ప్రమాద స్థాయిని దాటడంతో తీవ్ర వరద పరిస్థితి నెలకొంది. భారీగా నీటిని విడుదల చేయడం వల్ల దష్క్రియ ఘాట్, సమీపంలోని ఇటుక బట్టీలు నీట మునిగిపోయాయి. మహారాష్ట్రలో భారీ వర్షం రైల్వే పట్టాలను కూడా నీట ముంచింది.

48 గంటల్లో 380 మి.మీ వర్షపాతం నమోదు 

రెండ్రోజుల భారీ వర్షాల నుంచి ముంబయి వాసులకు కాస్త ఉపశమనం లభించింది. మంగళవారం వరుసగా మూడవ రోజు కూడా కుండపోత వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ, భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) ముంబై, దాని పరిసర శివారు ప్రాంతాలకు 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది. గత 48 గంటల్లో రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షాలు ఆర్థిక రాజధాని అంతటా సాధారణ జనజీవనాన్ని తీవ్రంగా అస్తవ్యస్తం చేశాయి. ముంబైలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, మున్సిపల్ పాఠశాలలు, కళాశాలలకు మంగళవారం ముందుజాగ్రత్త సెలవును బీఎంసీ ప్రకటించింది. ముంబయిలో ఇవాళ వర్షాలు తెరిపిచ్చాయి. దీంతో అధికారులు లోకల్ ట్రైన్ సర్వీసులను పునరుద్ధరించారు. ముంబయిలో భారీ వర్షాలకు పలు చోట్ల గోడలు, ప్రకటనల హోర్డింగ్ లు కూలిపోయాయి. ముంబయిలో 48 గంటల్లో 380 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు పేర్కొన్నారు.