సౌదీ బస్సు ప్రమాదం అత్యంత బాధాకరం: కేటీఆర్
హైదరాబాద్: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో(Saudi bus accident) హైదరాబాద్ కు చెందిన అనేక మంది యాత్రికులు మరణించడం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. మక్కా నుండి మదీనాకు వెళుతున్న సమయంలో డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొన్న ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు. మృతుల్లో ఎక్కువమంది హైదరాబాదీలే ఉన్నారనే సమాచారం అందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విదేశీ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలను ముమ్మరం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఊహించని విధంగా జరిగిన ప్రమాదంలో మరణించిన వారి వివరాలను గుర్తించి వారి కుటుంబాలకు అన్నిరకాలుగా సర్కారు అండగా నిలవాలని ఆయన పేర్కొన్నారు.




