భార్యను చంపి.. వ్యక్తి ఆత్మహత్య
వివాహేతర సంబంధమే కారణం?
నాగర్కర్నూల్, మే 10 (విజయక్రాంతి): వివాహేతర బంధం నేపథ్యంలో ఓ వ్యక్తి భార్యను అత్యంత కిరాతకంగా చంపి, అనంతరం తానూ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మంగనూరులో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు, ఎస్సై నాగశేఖర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సంగనమోని వెంకటయ్య (45), భార్య తారకమ్మ(శివనీల) (36)కు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. తారకమ్మ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నది. ఈ విషయంపై వెంకటయ్య గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించి పలుమార్లు మందలించారు. అయినా ఆమె తీరు మార్చుకోలేదు. గురువారం రాత్రి కూడా ఆమె సదరు వ్యక్తితో భర్తకు కనపడింది. దీంతో రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తారకమ్మను నేలకు బలంగా బాదడంతో తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాలు వదిలింది. అనంతరం తానూ గ్రామ పొలిమేరలోని ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటయ్యకు ఇద్దరు భార్యలు కాగా పెద్ద భార్య చాలా కాలంగా దూరంగా ఉంటోంది. కాగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాలను జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసునమేదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






