29-01-2026 12:06:23 PM
నకిలీ వైద్యుడు రిమాండ్
మేడిపల్లి,(విజయక్రాంతి): వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డైరీ ఫారం వ్యాపారం చేసే పి. ఎల్లం (56) సోమవారం రాత్రి జ్వరంతో బాధపడుతుండగా అతని భార్య మేడిపల్లిలోనే ఆర్ఎంపీ వైద్యుడు వద్దకు తీసుక వెళ్ళింది. వైద్య పరీక్షల అనంతరం రెండు ఇంజక్షన్లు ఇవ్వగా వెంటనే ఎల్లం నోట్లో నుంచి నురగలు రావడం తో, గమనించిన భార్య భయంతో ఈ విషయాన్ని కుమారుడు నాగరాజుకు తెలియజేసింది. అనంతరం బాధితుడిని బోడుప్పల్ లోని కేకే స్వర హాస్పిటల్ కు తరలించారు.
అప్పటికే పరిస్థితి విషమించడంతో అదే రాత్రి ఎల్లం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతిని కుమారుడు నాగరాజు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో విచారణలో అసలు విషయాలు బయటకు వచ్చాయి. లునావత్ రూప్ సింగ్ నకిలీ వైద్యుడు అని, అతడు డాక్టర్ చదివినట్లు ఎలాంటి అర్హత పత్రాలు లేకుండా వైద్య సేవలు అందిస్తున్నట్లు తేలింది. ఈ మేరకు పోలీసులు బుధవారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని. ఎలాంటి అర్హత పత్రాలు లేని వ్యక్తుల వద్ద చికిత్స తీసుకోవద్దని, నకిలీ వైద్య సేవలు అందిస్తూ ప్రజలను మోసగిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి తెలిపారు.