18 May, 2026 | 1:08 AM

సెంట్రింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

18-05-2026 12:24 AM

మొయినాబాద్ సెంటరింగ్ అసోసియేషన్ వినతి పత్రం సమర్పణ

మొయినాబాద్, మే 16 (విజయక్రాంతి): మొయినాబాద్ మండల కేంద్రానికి చెందిన సెంటరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మొయినాబాద్ సెంటరింగ్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా సెంటరింగ్ కార్మికులు ఉపాధి సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

2016లో సుమారు 46 మంది కార్మికులతో ప్రారంభమైన సంఘం ప్రస్తుతం 51 మంది సభ్యులతో కొనసాగుతోందని పేర్కొన్నారు. భవన నిర్మాణ రంగంలో కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, కార్మికులకు గుర్తింపు కార్డులు, బీమా, వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మికుల పిల్లలకు విద్యా సహాయం అందించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సెంటరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు.