18-02-2026 12:00:00 AM
శంకర్పల్లి, ఫిబ్రవరి 17( విజయక్రాంతి):రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని చందిప్ప గ్రామంలో కొలువై ఉన్న 11వ శతాబ్దపు అపురూప క్షేత్రం శ్రీ బ్రహ్మసూత్ర మరకత లింగేశ్వర స్వామిని ప్రముఖ సినీ రచయిత, రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ వారు ఆయనను శేష వస్త్రంతో సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు.
దర్శనం అనంతరం విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆలయ విశిష్టతను కొనియాడారు. పురాతనమైన ఈ శివలింగాన్ని దర్శించుకోవడం మనసుకు ఎంతో ప్రశాంతతను ఇచ్చిందని పేర్కొన్నారు. దేశంలోనే ’బ్రహ్మసూత్రం’ కలిగిన మరకత లింగాలు కేవలం రెండే ఉన్నాయని, ఒకటి తమిళనాడులో ఉండగా, మరొకటి మన తెలంగాణలోని చందిప్పలో ఉండటం గర్వకారణమని ఆయన అన్నారు. ఈ మహిమగల క్షేత్రానికి రోజురోజుకూ భక్తులతో పాటు ప్రముఖుల తాకిడి పెరుగుతోందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు సాయిశివ, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.