21-02-2026 12:03:22 AM
కలెక్టర్ రాహుల్ రాజ్
కొల్చారం, ఫిబ్రవరి 20: కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో నిర్వహిస్తున్న పదో తరగతి ప్రత్యేక తరగతులను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సామర్థ్యాలను అడిగి తెలుసుకుని, సబ్జెక్టులను ఎలా అభ్యసించాలి, మంచి మార్కులు ఎలా సాధించాలనే విషయాలపై మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో శతశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు.
విద్యార్థులు బట్టీ విధానానికి స్వస్తి పలికి, విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. తూచా తప్పకుండా ప్రత్యేక తరగతులకు హాజరు కావాలని, టీవీ, మొబైల్ ఫోన్, సోషల్ మీడియాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఇష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో ఎంఈఓ ఉమా రాణి. గ్రామ సర్పంచ్ దయాకర్ గౌడ్. ఎం.ఆర్.సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.