తెలంగాణ టీడీపీకి కొత్త ఊపిరి?
బాబుతో భేటీ అయిన తీగల కృష్ణారెడ్డి..
గులాబీ వీడి పసుపు కండువా కప్పుకునేందుకు సిద్ధం!
రంగారెడ్డి, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాల్లో(Telangana Politics) అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి తిరిగి సొంతగూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. ఆదివారం గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి(AP Chief Minister Nara Chandrababu Naidu) నివాసంలో వీరిద్దరి భేటీ ముగిసింది. సుమారు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో తెలంగాణలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘం గా చర్చించారు.
బీఆర్ఎస్తో విబేధాలు...
తెలుగుదేశం పార్టీతోనే రాజకీయ అరంగేట్రం చేసిన తీగల కృష్ణారెడ్డి, ఆ పార్టీలోనే హైదరాబాద్ మేయర్గా, 2014లో మహేశ్వరం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వా త మారిన రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్ (అప్పటి టిఆర్ఎస్) తీర్థం పుచ్చుకున్నారు. అయితే, సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరి స్థానిక నా యకత్వాన్ని చేజిక్కించుకోవడంతో తీగలకు పొగబెట్టినట్లయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం టికెట్ ఆశించినప్పటికీ స బితకే కేటాయించడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురై బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
కాంగ్రెస్ నుంచి టీడీపీ వైపు మొగ్గు
గత ఏడాది తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, సిఎం రేవంత్ రెడ్డిని కలి సి కాంగ్రెస్లో చేరతారని ప్రచారం సాగినా, సరైన రాజకీయ హామీ లభించకపోవడంతో ఆ ప్రతిపాదన ముందుకు సాగలేదు. ఈ క్ర మంలోనే పాత అనుబంధం దృష్ట్యా మళ్లీ టీడీపీ బాట పట్టాలని తీగల నిర్ణయించుకున్నారు.
గ్రేటర్ రాజకీయాల్లో కీలక మార్పులు?....
చంద్రబాబుతో జరిగిన సమావేశంలో తెలంగాణలో ప్రస్తుతం మిగిలి ఉన్న బలమైన టీడీపీ క్యాడర్ను ఏకతాటిపైకి తెచ్చే అం శంపై ప్రధానంగా చర్చ జరిగింది.
టీటీడీపీ అధ్యక్ష బాధ్యతలు?...
తెలంగాణ టీడీపీకి ప్రస్తుతం బలమైన నాయకత్వం లేకపోవడంతో, బీసీ వర్గానికి చెందిన సీనియర్ నేత తీగలకు ’టీటీడీపీ అ ధ్యక్ష పగ్గాలు’ అప్పగించే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.ఏడాది క్రిత మే ఏపీ సీఎం ను తీగల ఆయన నివాసంలో హైదరాబాదులో కలిశారు. అప్పుడే తీగల టిడిపిలో చేరుతారని ప్రచారం జరిగింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభావం...
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తీగలకు విస్తృతమైన అనుచరగణం ఉంది. ఆయన రాకతో గ్రేటర్ పరిధిలో టీడీపీకి తిరిగి పూర్వవైభవం వస్తుందని అధిష్ఠానం భావిస్తోంది.
త్వరలోనే అధికారికంగా రీ-ఎంట్రీ..
విజయవాడ లేదా హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తీగల కృష్ణారెడ్డితో పాటు ఆయన కోడలు (రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తీగల అనితా రెడ్డి) మరియు వేలాది మంది అనుచరులు టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేయనున్నారు.ఈ పరిణామం గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లోనే కాకుండా, తెలంగాణ వ్యాప్తంగా టీడీపీ పునరుజ్జీవనానికి నాంది పలుకుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.