06-02-2026 01:48:10 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి5(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన కేంద్ర కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి జె. రాజేందర్, టి యు సి ఐ జిల్లా కార్యదర్శి జి. తిరుపతి మాట్లాడుతూ లేబర్ కోడ్ల నోటిఫికేషన్ను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. సింగరేణి, ఆర్టీసీ, సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికులతో పాటు స్కీం వర్కర్లు, ఎన్హెచ్ ఎం ఉద్యోగులు సహా అన్ని వర్గాల కార్మికులు సమ్మెలో పాల్గొనాలని కోరారు.