18 May, 2026 | 5:54 PM

పెద్దపల్లి నియోజకవర్గంలో కటింగ్ లు లేకుండా వడ్లు, మక్కలు కొనుగోలు

18-05-2026 05:19 PM

రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పెద్దపల్లి నియోజకవర్గం లో కటింగ్ లు లేకుండా వడ్లు, మక్కలు కొనుగోలు 

ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు 

సుల్తానాబాద్, (విజయక్రాంతి): రాష్ట్రంలో  ఎక్కడ లేని విధంగా పెద్దపల్లి నియోజకవర్గంలో మక్కలు , ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని  ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు, సోమవారం పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంట గ్రామంలో మార్క్ ఫేడ్ , సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న, వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు, కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్న విషయమై అప్పటికప్పుడు ఎమ్మెల్యే విజయరమణ రావు  అధికారులతో చర్చించి రైతుల సమస్యలను పరిష్కరించారు.

ఈ సందర్భంగా  విజయరమణ రావు  మాట్లాడుతూ..కొనుగోళ్ల విషయంలో చిన్న చిన్న విషయాలను రాద్ధాంతం చేసి రాజకీయాలు చేయడం తగదన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఎలాంటి కటింగులు లేకుండా పారదర్శకంగా కొనుగోలు జరుపుతున్నట్టు చెప్పారు. అధికార యంత్రాంగంతో రైస్ మిల్లర్ పై ఒత్తిడి తెచ్చి వడ్ల దిగుమతిని చేయిస్తూ ప్రతిక్షణం పర్యవేక్షణ జరుపుతున్నామని తెలిపారు. ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. మార్క్ ఫెడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మక్కలు కొనుగోలు చేస్తూ రైతులకు అండగా ఉంటుందన్నారు.

ప్రభుత్వం సేకరించిన మక్కలకు మార్కెటింగ్ లేకున్నప్పటికీ నష్టాన్ని భరిస్తూ ప్రభుత్వం ముందుకు వెళుతుందని చెప్పారు. గత బిఆర్ఎస్ పాలనలో అప్పటి ప్రజాప్రతినిధుల సహకారంతో కొనుగోళ్లలో పూర్తి స్థాయిలో రైతులకు అన్యాయం జరిగిందని చెప్పారు. క్వింటాలకు 10 కిలోల చొప్పున కటింగులు జరిగాయి అన్నారు. అప్పడు నోరు మెదపని వారు ఇప్పుడు పారదర్శకంగా కొనుగోలుజరుగుతున్నప్పటికీ రాద్ధాంతం చేయడం తగదన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు , పలు గ్రామాల సర్పంచ్ లు , మండల పార్టీ అధ్యక్షులు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు  పాల్గొన్నారు.