10-02-2026 12:45:11 AM
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
నిజామాబాద్, ఫిబ్రవరి 9(విజయక్రాంతి ): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. సోమవారం ఖానాపూర్ కాలూర్ సారంగాపూర్ ముబారక్ నగర్ ధర్మపురి హిల్స్ తదితర ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్ల టిఆర్ఎస్ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని తెలంగాణ ప్రజలు దోపిడీకి గురయ్యారని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పేదవాడికి సన్న బియ్యం అందిస్తున్నామని ఉచిత కరెంటు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని, రైతులకు రుణమాఫీ జరిగిందని రైతుబంధు పథకం పక్కాగా అమలవుతుందని మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందుతున్నాయని వివరించారు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని ఇంటి స్థలాలు లేని పేదలను గుర్తించి ఇంటి స్థలాలను సైతం అందిస్తామని హామీ ఇచ్చారు.
కుల మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టే బిజెపిని తరిమికొట్టాలని, ఉనికిని కోల్పోయిన టిఆర్ఎస్ పార్టీని పక్కకు పెట్టాలని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అభివృద్ధికి బాటలు వేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, సీనియర్ నాయకులు బాగారెడ్డి, గడీల రాములు, కార్పొరేటర్ అభ్యర్థులు భోజన్న హరిచంద్ర నాయక్ హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు