మల్కాజిగిరిలో ‘రాగిడి’ గెలుపు ఖాయం

25-04-2024 02:19:41 AM

మాజీ మంత్రి కేటీఆర్ 

మేడ్చల్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు ఖాయమని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం మేడ్చల్ జిల్లాలోని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కేటీఆ ర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సంవత్సరంలో కేసీఆర్ చుట్టూరా రాష్ట్ర రాజకీయమంతా తిరిగేలా చేద్దామని, భారీ మెజార్టీతో రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు.

బీఆర్ ఎస్ గెలిస్తేనే కాంగ్రెస్ ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేస్తుందని చెప్పారు. ప్రతి కార్యకర్త ఓ సైనికుడిగా పని చేయాల్సిన అవసరమున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, శంభీపూర్ రాజు, దయానంద్, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మాదవరం కృష్ణారావు, కేపీ వివేకానంద్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.