calender_icon.png 10 June, 2025 | 11:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ సమూల మార్పులకు శ్రీకారం

10-06-2025 12:46:22 AM

-సామాన్యుడి అవసరాలు తీర్చడానికి ఆర్టీసీ నిరంతర కృషి 

-అందుకే సంస్థ బలోపేతానికి తగిన ప్రాధాన్యత.                        

-పర్యావరణ పరిరక్షణ కోసమే ఎలక్ట్రిక్ బస్సులు                       

-మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ లాభాలబాటలోకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క 

-ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కృషి

-రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

సూర్యాపేట, జూన్ 9 (విజయక్రాంతి) : ఆర్టీసీ సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది ఈ ప్రజా ప్రభుత్వమేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రివర్యులు మల్లు  భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలతో కలిసి సూర్యాపేట బస్ డిపోకి ప్రభుత్వం మంజూరు చేసిన ఎలక్ట్రిక్ బస్సులను  ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ సామాన్యుడి అవసరాలు తీర్చడానికి ఆర్టీసీ సంస్థ నిరంతరం కృషి చేస్తున్నదని, అది గుర్తించి ఈ ప్రభుత్వం దాని బలోపేతానికి తగిన ప్రాధాన్యతని ఇస్తుందన్నారు. పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి అయినప్పటినుండి  ఆర్టిసి లో సమూల మార్పులు తెచ్చి అనేక సంస్కరణలతో ముందుకు వెళ్ళటం శుభ పరిణామన్నారు. 

 గతంలో ఆర్టీసీ నష్టాల బాటలో కొనసాగిందని కానీ ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆర్టీసీ అనే ప్రభుత్వ సంస్థను కాపాడుకునేందుకు, ఆర్థికంగా నిలబెట్టేందుకు తగు చర్యలతో ముందుకు  వెళ్తున్నామన్నారు. పాత బస్సులను, డీజిల్ బస్సులను పక్కకి పెట్టి పర్యావరణ పరిరక్షణకు గాను సూర్యాపేట డిపోకు 79 ఎలక్ట్రికల్ బస్సులు  మంజూరీ చేశామన్నారు. లో భాగంగా 45 ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

రాష్ట్ర రాజధాని, ఔటర్ రింగ్ రోడ్ లోపల, హైదరాబాద్ మహానగరంలో వాతావరణ ఆహ్లాదకరంగా ఉండేందుకు 2800 ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటుచేసి సామాన్యులకు రవాణా అవసరాలు  తీరుస్తున్నామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని ఆడపడుచులు అందరు ఆర్టీసీ బస్సుల ద్వారా రాష్ట్రము లొ ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా వెళ్తున్నారన్నారు. 

దీనికిగాను ఇప్పటివరకు రూ.182 కోట్ల జీరో టికెట్లు జారీ చేశామని వాటి ద్వారా తెలంగాణ  ఆడపడుచులు 6088 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని ఆ డబ్బులు ప్రభుత్వం ఆర్టీసీకి నేరుగా జమ చేయడం జరిగిందన్నారు. దానితో నేడు ఆర్టీసీ ఆర్థికంగా నిలదొక్కుకొని పూర్తి సామర్థ్యంతో రాష్ట్రమంతా బస్సులు  నడుపుకోగలుగుతుందన్నారు. ప్రజా ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తుందన్నారు.

 ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కృషి 

రాష్ట్ర రవాణా, బి సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చుట్టు ముట్టు  సూర్యాపేట నడుమ నల్గొండ అంటూ తెలంగాణ సాయుధ పోరాటం గుర్తు చేసుకుంటూ మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల అభివృద్ధికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యతని ఇస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికుల అనేక సమస్యలను పరిష్కరించి వారికి అండగా నిలుస్తుంది అన్నారు.

నేడు సూర్యాపేట డిపో నుండి హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, కోదాడ లాంటి ప్రాంతాలలో వాతావరణంను కాపాడడానికి ఎలక్ట్రికల్ బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. సూర్యాపేటకు 79 ఎలక్ట్రికల్ బస్ లు మంజూరు చేయగా నేడు 45 ఎలక్ట్రికల్ బస్ లు ప్రారంభం చేయటం జరుగుతుందన్నారు. ఇప్పటికే హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ లో ఎలక్ట్రికల్ బస్ లు నడుస్తున్నాయని త్వరలో నల్గొండ లో కూడా ఎలక్ట్రికల్ ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేసి బస్ లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు అమ్మగారి ఇంటికి, పుణ్య క్షేత్రాలకి ఉచితంగా ఆర్టీసీ ద్వారా ప్రయాణిస్తున్నారని అన్నారు. ఇందుకు గాను ప్రతి నెల 300 నుంచి 350 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇస్తున్నారని తెలిపారు.ఈ ఆర్థిక సహాయం ద్వారా కార్మికుల సంక్షేమం, భవిష్య నిది, నూతన బస్సులు, కారుణ్య నియామకాలు ఇస్తున్నామని తెలిపారు.

గత 10 సంవత్సరాలు ఒక్క నూతన బస్సు గాని, కొత్త ఉద్యోగం గానీ ఇవ్వకుండా ఆర్టీసీని నష్టాల ఊబిలో కురుకొనిపోయేలా చేశారని, కానీ ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి వేలాది కొత్త బస్సులు, ఉద్యోగాలు నియమించటం జరిగిందన్నారు. ఆర్టీసీని పరిరక్షించుకుంటూ గ్రామాలకు రవాణా వ్యవస్థ చేరుకునేలా భవిష్యత్తులో కొత్త బస్సులు కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. తదుపరి ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణం చేశారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పి నరసింహ,ఎమ్మెల్యే లు నలమాద పద్మావతి రెడ్డి, మందుల సామెల్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ , పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ చెవిటి వెంకన్న యాదవ్ సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి వైస్ చైర్మన్ శ్రీనివాస్, ఎక్సక్యూటివ్ డైరెక్టర్లు ఉపేష ఖాన్,వెంకన్న, జేబీఎం సంస్థ ప్రతినిధి ప్రభాకర్, ఆర్టీసీ  అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.