08-06-2025 12:56:06 AM
మేడిగడ్డ బ్యారేజీలో ఆరుగురు విద్యార్థులు గల్లంతు?
మహదేవపూర్, జూన్ 7: సెల్ఫీ సరదాతో గోదావరిలో మునిగి ఆరుగురు యువకులు మృతి చెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో పెళ్లికి వచ్చిన విద్యార్థులు స్థానికులతో కలిసి ఆటోలో మేడిగడ్డ ప్రాజెక్టు ఎగువ ప్రాం తం గోదావరిలో శనివారం ఈతకు వెళ్లా రు. ఏడుగురు యువకులు గోదావరిలో ఈత కొడుతూ ఒకరు గోదావరి ఒడ్డుపై ఉండి ఈత కొడుతున్న యువకులను ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తున్నాడు.
ఈక్రమంలోనే గోదావరిలోని యువకులు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఇంకా లోతుకు వెళ్లారు. లోతు ఎక్కువ గా ఉండటంతో ఒకరి తర్వాత ఒకరు మునిగిపోయారు. ఒక యువకుడు మా త్రమే బయటికి వచ్చాడు. మిగిలిన యువకులు గల్లంతయ్యారు.
గల్లంతైన వారిలో మహాదేవపూర్ మండలం అం బటిపల్లికి చెందిన మధుసూదన్ (18), శివ మనోజ్(15), రక్షిత్(13), సాగర్ (16), కొర్లకొండ గ్రామానికి చెందిన పండు(18) రాహుల్ (19) ఉన్నారు.
సమాచారం తెలుసుకున్న మంత్రి దుద్ది ళ్ల శ్రీధర్బాబు జిల్లా యంత్రాంగాన్ని, పోలీస్ శాఖను అప్రమత్తం చేయడంతో సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో గోదావరి నదిలో ఈత కొట్టడం, సెల్ఫీలు తీయడం నిషేధిస్తూ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ టీఎస్ దివాకర ఆదేశాలు జారీ చేశారు.