08-06-2025 01:02:02 AM
ఖైరతాబాద్, జూన్ 7: మృగశిర కార్తి పురస్కరించుకొని ఏటా ఆస్తమా రోగులకు బత్తిని బ్రదర్స్ అందించే చేపమందు పంపిణీని ఆదివారం, సోమవారం రెండురోజుల పాటు హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో పంపిణీ చేయనున్నారు. అందు కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తెలిపారు.
శనివారం చేప ప్రసాదం నిర్వాహకుడు బత్తిని గౌరీశంకర్ గౌడ్తో కలిసి సాయికుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. రోగులు, వారి సహాయకుల కోసం భోజనం, వసతి, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలతో కలిసి అవసరమైన ఏర్పాట్లు చేయాల ని అధికారులను కోరారు. తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిసా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కాక ఇతర దేశాల నుంచి కూడా అస్తమా బాధితులు వస్తుంటారని తెలిపారు.
దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా 130 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ తెలిపింది. 24 గంటల వైద్య సర్వీసులతోపాటు ఆర్ అండ్ బీ అధికారులు షెడ్లు, ఫ్లడ్ లైట్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు శానిటేషన్, జలమండలి మంచినీటి సరఫరా ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నారు.
ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై సోమవారం సాయంత్రం 6 గంటలకు ముగియనున్న చేపమందు పంపిణీలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీస్ శాఖ తెలిపింది.