calender_icon.png 21 June, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన రవి ఉద్యమ ప్రస్థానం

21-06-2025 02:41:34 AM

  1. విప్లవ యోధుడుకి కన్నీటి వీడ్కోలు పలికిన వెలిశాల 
  2. కడసారి చూపు కోసం తరలివచ్చిన జనం 
  3. నివాళులర్పించిన ఎమ్మెల్యే జిఎస్ ఆర్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ స్పీకర్ మధుసూదనాచారి 

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 20 (విజయ క్రాంతి): ఎన్కౌంటర్లో మరణించిన ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి ఎలియాస్ గణేష్, ఉదయ్ స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామంలో శుక్రవారం అశ్వనయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి.

ఉద్యమ పోరులో నేలకొరిగిన ధ్రువతార గాజర్ల రవికి కన్నీటి వీడ్కోలు పలికేందుకు తెలంగాణ, ఆంధ్ర , ఒరిస్సా, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నాయకులు, ప్రముఖులు, అభిమానులు తరలివచ్చారు. అరుణ పతాకాలతో రవి అంతిమయాత్రతో వెలిశాల గ్రామం అరుణ వర్ణంగా మారింది. విప్లవ గీతాలు, నినాదాలతో పోరుగడ్డ వెలిశాల మార్మోగింది.

విప్లవ యోధుడికి అడుగడుగునా జనం జోహార్లు పలికారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ స్పీకర్ మధుసూదనాచారి దివంగత రవి భౌతిక కాయంపై పుష్ప గుచ్చం ఉంచి నివాళులర్పించారు. రవి సోదరుడు, మావోయిస్టు మాజీ నేత ప్రస్తుత కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు గాజర్ల అశోక్ ను పరామర్శించి ఓదార్చారు.

అంతిమయాత్రలో ప్రజాసంఘాల నాయకులు, కవులు, కళాకారులు, అమరవీరుల ఆత్మీయ బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అంజమ్మ, ఉపాధ్యక్షురాలు శాంతి, పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కుమారస్వామి, సింగరేణి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గట్టయ్య వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.