24 March, 2026 | 2:23 AM

2029లో ‘మహిళా రిజర్వేషన్’ అమలు!

24-03-2026 12:38 AM
  1. 2011 జనాభా ఆధారంగా సిద్ధమవుతున్న కేంద్రం
  2. నారీ శక్తి వందన్ అధినియం చట్టానికి సవరణలకు సన్నద్ధమైన మోదీప్రభుత్వం
  3. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశం..
  4. వచ్చే వారంలో మొదట రాజ్యసభలోకి?
  5. మొత్తం 816కు పెరుగనున్న లోక్‌సభ సీట్ల సంఖ్య
  6. ఇందులో 273 సీట్లు మహిళలకు రిజర్వ్డ్
  7. కొత్త జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తర్వాతే అమలు?!

న్యూఢిల్లీ, మార్చి 23: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం మహిళా నాయకత్వమే లక్ష్యంగా నిర్ణయం తీసుకుంది. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికే మహిళా రిజర్వేషన్లు అమలు చేసేలా ‘నారీ శక్తి వందన్ అధినియం’ చట్టానికి కీలక సవరణలు తీసుకు రావాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. దేశ రాజకీయాల్లో మహిళా శక్తికి పట్టం కట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద సాహసోపేతమైన ముందడుగు వేస్తోంది.

2011 జనా భా లెక్కల ఆధారంగా మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ప్రభుత్వం త్వరలో అమలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ చట్టం అమలయితే, మొత్తం లోక్‌సభ సీట్లు 816కు పెరుగుతాయి. ఇందులో 273 సీట్లు మహిళలకు రిజర్వ్ చేయబడతాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంటులో మహిళల ప్రాతినిథ్యాన్ని పెంచే దిశగా ఇది ఒక పెద్ద ముందడుగు అవుతుంది.

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, 2011 జనా భా లెక్కల ఆధారంగా ఈ కొత్త చట్టాన్ని రూపొందించే ప్రణాళికలతో మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడానికి సిద్ధమ వుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత చట్రం ప్రకారం, మొత్తం లోక్‌సభ సీట్ల సంఖ్య 543 నుంచి 816కు పెరుగు తుంది, ఇందులో 273 సీట్లు మహిళలకు రిజర్వ్ చేయబడతాయి.

అసలు చట్టం ప్రకా రం, కొత్త జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తర్వాత మాత్రమే ఈ రిజర్వేషన్ అమల్లోకి వస్తుందని నిర్దేశించబడింది. అయితే, కేంద్ర ప్రభుత్వం వేగంగా ముందుకు వెళ్లాలని ఆసక్తిగా ఉందని, చట్టాన్ని సవరించి, పార్లమెంటు దిగువ సభలో మహిళల ప్రాతినిథ్యాన్ని పెంచేందు కు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ఒక బిల్లును ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

రాజ్యాంగ సవరణ సులభంగా ఆమోదం పొందడానికి విస్తృత మద్దతు కూడగట్టే ప్రయత్నం జరుగుతోందని ప్రతిపక్ష పార్టీలతో జరిపిన ప్రాథమిక సంప్రదింపులు కూడా సూచించాయి. క్యాబినెట్ ఆమోదం తర్వాత, ఈ చట్టాన్ని మొదట రాజ్యసభలో, బహుశా వచ్చే వారంలో ప్రవేశపెట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. 2023లో ఆమో దించబడిన ఈ మహిళా రిజర్వేషన్ చట్టం, లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలు రెండింటిలోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తుంది. కానీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పెండింగ్ లో ఉన్నందున ఇది ఇంకా అమలులోకి రాలేదు.

నియోజకవర్గాల పునర్విభజనకు ముందే ప్రభుత్వం రిజర్వేషన్ను అమలు చేయడానికి ముం దుకు వెళితే, మరో రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. ప్రస్తుతం మహిళా రిజర్వే షన్‌ను, చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల అనంతరం జరిగే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో ముడిపెడుతు న్న చట్టంలోని సెక్షన్ 5ను పార్లమెంటు సవరించాల్సి ఉంటుంది.

రాజ్యాంగ మార్పుగా, ఆర్టికల్ 368(2) ప్రకారం.. ఉభయ సభలలో మొత్తం సభ్యులలో మెజారిటీ, హాజరై ఓటు వేసిన వారిలో కనీసం మూడింట రెండు వంతుల ఆమో దం తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. లోక్‌సభలో 240 మంది, రాజ్యసభలో 103 మంది ఎంపీలు మాత్రమే ఉన్న బీజేపీకి, ప్రతిపక్ష పార్టీల మద్దతు లేకుండా ఈ సవరణను ఆమోదించడానికి ఏ సభలోనూ తగి నంత సంఖ్యాబలం లేదు.

గతవారం, మహి ళా రిజర్వేషన్ల చట్టం అమలుకు సంబంధించిన ‘విధానాలు, కార్యాచరణ ప్రణాళిక’పై చర్చించడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజును కోరారు. అయితే మహిళా రిజర్వేషన్ల అమలును 2029 లోపు పూర్తి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ కమిటీ సమావేశంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

లాటరీ విధానం ద్వారా మహిళా సీట్లు కేటాయింపు?

మహిళా రిజర్వేషన్లు అమలైతే పార్లమెంటులో మూడో వంతు సీట్లు (33 శాతం) మహిళలకే దక్కుతాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా ని యోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టి, ఈ రిజర్వేషన్లను అమలు చేయాలన్నది కేంద్రం ఆలోచిస్తోంది. దీనికోసం కొనసాగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే సవరణ బిల్లు ను ప్రవేశపెట్టేందుకు సన్నద్దమవుతోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విపక్ష నాయకులతో సంప్రదింపులు జరుపుతూ ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ భారీ మార్పుల కోసం డీలిమిటేషన్ చట్టం తో పాటు ఇతర నిబంధనలను కూ డా సవరించాల్సి ఉంటుంది.

జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పరిధి మార్చిన తర్వాత, ఏయే స్థానాలను మహిళలకు కేటాయించాలనే అంశా న్ని లాటరీ విధానం (డ్రా ఆఫ్ లాట్స్) ద్వారా నిర్ణయించనున్నారు. దీనివల్ల రిజర్వేషన్ల కేటాయింపులో పారదర్శకత ఉంటుందని, ప్రతి ఎన్నికకూ మహిళా స్థానాలు మారుతూ ఉంటాయని అధికారులు వివరిస్తున్నారు.