14 July, 2026 | 9:16 PM

ముత్యాలంపాడు సబ్‌స్టేషన్ పనులు వేగవంతం చేయాలి

14-07-2026 09:09 PM

టేకులపల్లి, (విజయక్రాంతి): మండలంలోని ముత్యాలంపాడు ఎక్స్‌రోడ్ వద్ద నిర్మాణంలో ఉన్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని టీజీఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) మధుసూదన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సీఎఫ్ (ఆపరేషన్స్) రాజు చౌహాన్‌తో కలిసి ఆయన నిర్మాణ పనులను పరిశీలించారు. సబ్‌స్టేషన్‌లో ఏర్పాటు చేస్తున్న పవర్ ట్రాన్స్‌ఫార్మర్, 33 కేవీ లైన్, ప్రొటెక్షన్ వ్యవస్థ, బ్రేకర్లు తదితర పనులను పరిశీలించిన అధికారులు, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని సూచించారు. నిర్మాణంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిర్ణీత గడువులో సబ్‌స్టేషన్‌ను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ (ఆపరేషన్స్) జి. మహేందర్, డీఈలు ఖలీల్, నందలాల్, గంగాస్వామి, ఏడీఈలు మధు, రఘురామయ్య, ఏఈలు, ఎంఆర్టీ అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.