ఇల్లందు ఆరోగ్య రంగ అభివృద్ధికి మంత్రి దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే కోరం వినతి
ఇల్లందు,(విజయక్రాంతి): ఇల్లందు నియోజకవర్గంలో ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను సచివాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి నూతన నర్సింగ్ కళాశాల మంజూరు చేయాలని కోరారు. ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో 5 పడకల ఐసీయూ, సీటీ స్కానింగ్ కేంద్రం, నూతన అంబులెన్స్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. టేకులపల్లి మండలంలోని చల్లసముద్రం, సుదిమళ్ల, బోడు గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీలు) ఏర్పాటు చేయాలని కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.






