నష్టాలకు బ్రేక్‌.. లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

16-09-2026 | 05:53pm

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండు రోజుల నష్టాలకు బ్రేక్‌ పడింది. ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లలో కొనుగోళ్లు సూచీలకు మద్దతుగా నిలిచాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల నిర్ణయానికి ముందు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం కూడా మదుపర్ల సెంటిమెంట్‌ను బలపరిచింది.

సెన్సెక్స్‌ 332.63 పాయింట్లు లాభపడి 74,336.45 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 99 పాయింట్లు పెరిగి 23,217.60 వద్ద ముగిసింది. నిఫ్టీలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఐటీసీ, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు గణనీయంగా లాభపడ్డాయి.

అయితే మార్కెట్‌లో అన్ని విభాగాల్లోనూ కొనుగోళ్ల జోరు కనిపించలేదు. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సూచీ 0.01 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 0.18 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా ఎఫ్‌ఎంసీజీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, రియల్టీ సూచీలు లాభాల్లో ముందంజలో నిలిచాయి. మరోవైపు ఐటీ, ఫార్మా సూచీలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

నిఫ్టీకి 23,300–23,400 స్థాయిలో నిరోధం ఎదురవుతోందని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. సూచీ 23,500 పైన నిలకడగా కొనసాగితే మార్కెట్‌ పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశం ఉందని తెలిపారు. దిగువన 23,100–23,070 స్థాయిని కీలక మద్దతుగా పరిగణిస్తున్నారు. 23,070 కిందకు జారితే అమ్మకాల ఒత్తిడి పెరిగి 23,000–22,800 స్థాయుల వరకు నిఫ్టీ వెళ్లే అవకాశం ఉందని విశ్లేషించారు.

ప్రస్తుతం మదుపర్ల దృష్టి అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయంపైనే ఉంది. వడ్డీ రేట్లపై ఫెడ్‌ చైర్మన్‌ చేసే వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్లలో నగదు లభ్యత, పెట్టుబడుల ప్రవాహం, సమీపకాల మార్కెట్‌ దిశపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు