24-12-2025 12:27:19 AM
* టీమిండియా అంతర్జాతీయ సిరీస్లకు చిన్న విరామం వచ్చింది. సౌతాఫ్రికా సిరీస్ ముగిసిపోగా మరో 20 రోజుల వరకూ ఎటువంటి షెడ్యూల్ లేదు. అయినప్పటకీ స్టార్ క్రికెటర్లు మాత్రం గ్రౌండ్లో సందడి చేయబోతున్నారు. దేశవాళీ క్రికెట్ బరిలో దిగుతున్నారు. కోహ్లీ, రోహిత్, గిల్, పంత్, జడేజా వంటి స్టార్ ప్లేయర్స్ అందరూ విజయ్ హజారే టోర్నీలో ఆడబోతున్నారు. దీంతో ఎన్నడూ లేని విధంగా ఈ సారి విజయ్ హజారే టోర్నీకి స్టార్ కళ వచ్చిందంటున్నారు.
సాధారణంగా దేశవాళీ క్రికెట్ టోర్నీలు జరుగుతున్నప్పుడు అభిమానుల్లో పెద్దగా ఆసక్తి ఉండదు. ఎందుకంటే సీనియర్ ప్లేయ ర్స్ జాతీయ జట్టు బిజీ షెడ్యూల్తో ఎవ్వరూ దీనిలో ఆడరు. విజయ్ హజారే ట్రోఫీ అయితే గత కొన్నేళ్లుగా ఎప్పుడు జరుగుతుందో కూడా చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్కు తెలీదు. స్టార్ ప్లేయర్స్ దీనిలో ఆడే తీరిక ఉండదు కాబట్టి అభిమానులు కూడా పట్టించుకోరు. అయితే ఈ సారి మాత్రం విజయ్ హజారే కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం టీమిండియా క్రికెటర్లు చాలా మంది బరిలోకి దిగుతుండడమే.
మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ , శుభమన్ గిల్, అర్షదీప్ సింగ్, ఇషాన్ కిషన్ , సూర్యకుమార్ యాదవ్, నితీశ్ కుమార్రెడ్డి వంటి టీమిండియా ప్లేయర్స్ అందరూ విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్నారు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా జాతీయ జట్టుకు సిరీస్లు లేనప్పుడు ప్రతీ ఒక్కరూ దేశవాళీ క్రికెట్ మ్యాచ్లు ఆడాలని బీసీసీఐ రూల్ తీసుకొచ్చింది. అలా ఆడిన వారినే సెలక్టర్లు పరిగణలోకి తీసుకుంటారని స్పష్టం చేయడంతో కోహ్లీ, కోహిత్తో సహా సీనియర్లు కూడా చాలా రోజుల తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడేందుకు రెడీ అయ్యారు.
ఈ టోర్నీకి సంబంధించి రోకో జోడీపైనే అందరి చూపు ఉంది. ఎందుకంటే 2027 వన్డే ప్రపంచకప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న రోహిత్, కోహ్లీ అప్పటి వరకూ తమ ఫిట్నెస్, ఫామ్ కొనసాగించుకోవడానికి దేశవాళీ మ్యాచ్లు ఆడాల్సిందేనని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో రోకో ద్వయం గత వారం నుంచే ప్రిపరేషన్లో బిజీగా ఉంది. సిక్కిం, ఉత్తరాఖండ్తో మ్యాచ్ల కోసం రోహిత్ జైపూర్లో అడుగుపెట్టాడు. ఈ టోర్నీలో 18 మ్యాచ్లు ఆడిన హిట్మ్యాన్ 600 పరుగులు చేశాడు.
అటు ఆంధ్రతో మ్యాచ్ కోసం కోహ్లీ బెంగళూరు వెళ్ళి ప్రాక్టీస్లో చెమటోడుస్తున్నాడు. దాదాపు 15 ఏళ్ళ తర్వాత విరాట్ విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్నాడు. ఈ టోర్నీలో అతనికి అద్భుతమైన రికార్డుంది. 2008-09 సీజన్లో 7 మ్యాచ్లు ఆడి నాలుగు సెంచరీలతో 534 రన్స్ చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇటీవల సౌతాఫ్రికాతో సిరీస్లో వరుస సెంచరీలతో అదరగొట్టిన విరాట్ ఇప్పుడు విజయ్ హజారేలోనూ చెలరేగిపోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
వీరితో పాటు టీ ట్వంటీ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కని శుభమన్ గిల్ కూడా తన ఫామ్ అందుకునేందుకు పట్టుదలగా ఉన్నాడు. వచ్చే నెలలో న్యూజిలాండ్తో సిరీస్కు ముందు ఈ సీనియర్లందరికీ విజయ్ హజారే ట్రోఫీ సన్నాహకంగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. వీరే కాదు ఢిల్లీ కెప్టెన్గా ఎంపికైన రిషబ్ పంత్, గిల్ , అర్షదీప్సింగ్, అభిషేక్ శర్మ వంటి ప్లేయర్స్ కూడా సత్తా చాటేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు.
కివీస్తో వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ఆరంభం కానుండగా.. ఈ లోపు జరిగే మ్యాచ్లలో వీరంతా అలరించబోతున్నారు. కుదిరితే అన్ని మ్యాచ్లకు, లేదంటే కనీసం 2 మ్యాచ్లైనా ఆడాలని బీసీసీఐ ఆదేశాలిచ్చింది. ఒకవేళ ఎవరైనా ఆటగాడు గాయంతో దూరమైతే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకుంటే మినహాయింపునిస్తామని పేర్కొంది.