15 July, 2026 | 12:47 AM

పంటలు ఎండుతున్నయ్

15-07-2026 12:46 AM
  1. తాగు నీటికీ ఇబ్బంది ఉంది
  2. కన్నెపల్లి పంపులు ఆన్ చేయండి
  3. మాజీ మంత్రి గంగుల కమలాకర్
  4. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల బాధ్యత మాదే 
  5. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి 

హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): ‘ఉత్తర తెలంగాణలో పంటలు ఎండిపోతున్నయ్, తాగు నీటికీ ఇబ్బంది అవుతుంది. మేడిగడ్డ బరాజ్ దగ్గర రోజూ తొమ్మిది టీఎంసీల నీళ్లు వృథాగా పోతున్నయ్. వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్ చేసి అన్నారం బరాజ్‌లోకి నీళ్లను ఎత్తిపోయండి’.. అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కలిసి విలేకరులతో మాట్లాడారు.

ఉత్తర తెలంగాణ సాగు, తాగు నీటికి తక్షణ చర్యలు అవసరమని, రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా, కన్నెపల్లి ఎత్తిపోతల పంపులు ఆన్ చేయాలని కోరారు. మేడిగడ్డపై దుష్ప్రచారం చేస్తున్న రాష్ట్ర మంత్రుల బృందం.. కరీంనగర్‌కు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ కన్నెపల్లి పంపుహౌస్ ద్వారా నీళ్లను ఎందుకు ఎత్తిపోయడం లేదో రైతులకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

భూ దందాలు చేసుకునే రేవంత్‌రెడ్డికి రైతుల గురించి తెలియదన్నారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు ఏమైనా జరిగితే 28 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలం భాద్యత వహిస్తామని, తమ పదవులకు రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి సిద్ధమేనా అని సవాల్ చేశారు. కన్నెపల్లి పంపులు ఆన్ ఆన్ చేయకపోతే సాగు, తాగునీటికి కష్టం అవుతుందన్నారు.

మొక్కజొన్న రైతుల కమిషన్ ఎవరు తింటున్నారో సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. బీఆర్‌ఎస్ విప్ కేపీ వివేకానంద మాట్లాడుతూ వర్షాలు కురువక రాష్ట్రంలో సాగు, తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్య జఠిలమయ్యే అవకాశం కనిపిస్తుందన్నారు.

కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్ట్‌గా ముద్రవేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుందని, ప్రజలు, రైతులు నమ్మరని పేర్కొన్నారు. ఎన్‌డీఎస్‌ఏ సాకుతో కన్నెపల్లి పంపులు ఆన్ చేయకుండా నిరక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, బండారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.