దర్గా అభివృద్ధికి రూ.8 కోట్లు కేటాయించండి
షాద్నగర్, మార్చి 12 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలోని ప్రసిద్ధగాంచిన జహంగీర్ పీర్ దర్గా సమగ్ర అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ను కోరారు. గురువారం హైదరాబాద్ లో మంత్రి కార్యాలయంలో ఆయనను ప్రత్యేకంగా కలుసుకున్న ఎమ్మెల్యే, దర్గా అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు.ప్రస్తుతం దాదాపు రూ. 12 కోట్ల హెచ్.ఎం.డి.ఏ నిధులతో దర్గా వద్ద వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
పెరుగుతున్న భక్తుల రద్దీ, సౌకర్యాల దృష్ట్యా మరో రూ. 8 కోట్ల అదనపు నిధులు అవసరమని ఎమ్మెల్యే వివరించారు. ఇటీవల తాను దర్గాను సందర్శించానని గుర్తు చేసిన మంత్రి అజారుద్దీన్, దర్గా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ఉందన్నారు. నిధుల మంజూరుకు సానుకూలంగా స్పందిస్తూ, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జహంగీర్ పీర్ దర్గా మతసామరస్యానికి ప్రతీక అని భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.




