సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడి హేట్టి గ్రామం వద్ద ప్రాణహిత నదిపై నిర్మాణంలో ఉన్న బరాజ్ ప్రాంతాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు త్వరలో సందర్శించే అవకాశం ఉన్నందున అన్ని విభాగాలు పూర్తిస్థాయి ఏర్పాట్లు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు.
శనివారం సమీకృత కలెక్టరేట్ లో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్లు యువరాజ్ మార్మాట్, ఎం. డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుమ్మిడి హేట్టి వద్ద ప్రాణహిత బరాజ్ ప్రాంతానికి పర్యటన జరగనున్న నేపథ్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లను సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. హెలిప్యాడ్, బ్యారికేడ్లు, వేదిక, వీఐపీ, వీవీఐపీ గ్యాలరీలు, అధికారుల మరియు మీడియా పాస్లు, పారిశుధ్య చర్యలు, త్రాగునీటి సౌకర్యాలు, అల్పాహారం, భోజన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
ప్రజలకు త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడంతో పాటు వైద్య సిబ్బందితో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరా నిరంతరంగా ఉండేలా ప్రత్యామ్నాయంగా జనరేటర్లు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. పర్యటనలో ఎలాంటి లోపాలు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






