11-06-2025 12:00:00 AM
హైదరాబాద్, జూన్ 10(విజయక్రాంతి): ఎప్పటినుంచో రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకు త్వరలోనే మోక్షం లభించనుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి తెలంగాణ ఉన్నత విద్యామండలి పం పించింది. దీనిపై నిర్ణయం రాగానే భర్తీ ప్రక్రియ ను మొదలుపెట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
రాష్ట్రంలోని 12యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతం లోనే నూతన మార్గదర్శకాలకు సంబంధించిన జీవోను విడుదల చేసింది. అయితే ఆయా యూనివర్సిటీల్లో అప్పటికే పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రొఫెసర్లు..తమను తొలగించి నియామక ప్రక్రియను ప్రభుత్వం చేపడుతోందని భా వించారు.
తమను రెగ్యులరైజ్ చేయాలని, ఆతర్వాతే నియామక ప్రక్రియ చేపట్టాలనే డిమాండ్తో కాంట్రాక్ట్ ప్రొఫె సర్లు ఏప్రిల్లో ఆందోళన బాట చేపట్టారు. దీంతో అప్పట్లో తెలంగాణ ఉన్నత విద్యామండలి.. కాంట్రాక్ట్ అధ్యాపకులతో చర్చలు జరిపింది. ఉద్యోగాల నుంచి తీసేయబోమని వారికి భరోసా ఇవ్వడంతో కాంట్రాక్ట్ అధ్యాపకులు తమ ఆందోళన విరమించారు.
ఈనేపథ్యంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేస్తున్న పోస్టులను పక్కనబెట్టి మిగతా ఖాళీలను భర్తీ చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈక్రమంలో 500 నుంచి 600 పోస్టులు భర్తీ చేయనుంది.
ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారం భం కానుంది. తొలుత ఇంజినీరింగ్తోపాటు ఇతర డిమాండ్ ఉన్న విభాగాలకు సంబంధించిన పోస్టులను భర్తీ చేయనున్నారు.
2,125 పోస్టులు ఖాళీ..
గత కొన్నేండ్లుగా యూనివర్సిటీల్లో నియామక ప్రక్రియ అటకెక్కింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 1,060 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కానీ, నియామక ప్రక్రియ చేపట్టకపోవడంతో వర్సిటీల్లో భారీగా ఖాళీలు పేరుకుపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దీనిపై దృష్టి సారించి యూనివర్సిటీల్లో ఖాళీల వివరాల లెక్కతీసింది.
రాష్ట్ర వ్యాప్తంగా 2,817 టీచింగ్ పోస్టులు మంజూరు ఉండగా, గత ఏప్రిల్ వరకు 2,125 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 1,524 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులుండగా, 1061 పోస్టులు మాత్రం ఖాళీగా ఉన్నాయి. ఇందులో తొలుత 500 నుంచి 600 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాద నలను ప్రభుత్వానికి అందజేసినట్లు పేర్కొన్నారు.