calender_icon.png 11 December, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏయూ లో ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ సైబర్ క్రైమ్ పై విద్యార్థులకు అవగాహన

11-12-2025 09:00:03 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): జీహెచ్ఎంసీ పోచారం సర్కిల్ వెంకటాపూర్ లోని అనురాగ్ యూనివర్సిటీలో ఏ-బ్లాక్ సెమినార్ హాల్లో గురువారం రాచకొండ కమిషనరేట్‌కు చెందిన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ సిఐ బి. రాజు, ఎస్ఐ జి. భాస్కర్ రెడ్డి ప్రత్యేక అతిథులుగా పాల్గొని విద్యార్థులకు సైబర్ క్రైమ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎన్ఎస్ఎస్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎన్ఎస్ఎస్ సెల్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ సి. మల్లేశ, యూనిట్–2 ప్రోగ్రామ్ ఆఫీసర్ పి. చిన్న శ్రీనివాస్ రావు, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ మహీపతి శ్రీనివాస్ రావు, అలాగే ఎన్ఎస్ఎస్ ట్రెయినీలు సౌరభ్, నవీన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ అనే ట్యాగ్‌లైన్‌తో నిర్వహించబడింది.

ఈ సందర్భంగా సిఐ బి. రాజు విద్యార్థులను ఉద్దేశించి సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయో మూడు ముఖ్య ఘటనల ద్వారా వివరించారు. మొదటగా, నకిలీ అధికారులుగా నటిస్తూ ‘డిజిటల్ అరెస్ట్’ పేరిట ఎలా మోసగాళ్లు వ్యక్తులను భయపెట్టించి డబ్బులు దోచుకుంటారో ఒక వాస్తవ ఉదాహరణతో చెప్పారు. రెండవ ఘటనగా, అనధికారిక ఆన్‌లైన్ లోన్ యాప్‌ల ద్వారా ప్రజలను ఎలా ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేస్తారో వివరించారు. మూడవ ఘటనలో, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో పార్ట్-టైమ్ ఉద్యోగాల పేరిట యువతను ఎలా మోసగాళ్లు వలలో వేసుకుంటారో వివరించారు. అలాగే విద్యార్థులు వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియా డిపి లుగా పెట్టకూడదని, అలా చేస్తే వేధింపులు ఇతర సైబర్ ముప్పులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా సూచించారు.

తదుపరి ఎస్ఐ జి. భాస్కర్ రెడ్డి, గూగుల్ ప్లే-స్టోర్‌లో అందుబాటులో ఉన్న వివిధ యాప్‌ల వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా రుణాలు, వ్యక్తిగత డేటా లేదా ఇతర సేవలకు ఉపయోగించే అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసేటప్పుడు అవి విశ్వసనీయమైనవో, ప్రభుత్వ అనుమతితో ఉన్నవో అని ముందుగా నిర్ధారించుకోవాల్సిన అవసరాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ అప్రమత్తత, ఆన్‌లైన్ మోసాల గుర్తింపు సురక్షిత ఇంటర్నెట్ వినియోగంపై విలువైన జ్ఞానాన్ని పొందారు. యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ సెల్ భవిష్యత్తులో ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహించనున్నట్లు తెలిపారు.