calender_icon.png 31 May, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీబీ ముక్త్ భారత్ పై బర్లగూడెంలో అవగాహన కార్యక్రమం

28-05-2025 07:25:29 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టీబీ ముక్త్ భారత్ క్యాంపెయిన్(TB Mukt Bharat Campaign)లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్(District Medical Health Officer Dr. Bhaskar Nayak), సులానగర్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ ఆదేశాలతో టేకులపల్లి మండలం కొప్పురాయి ఆరోగ్య ఉపకేంద్రం పరిధిలోని బర్లగూడెం గ్రామంలో క్షయ వ్యాధిగ్రస్తుల గుర్తింపు ప్రత్యేక కార్యక్రమం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వజ్జా పార్వతి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... క్షయ వ్యాధి లక్షణాలైన రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం బరువు తగ్గడం, రాత్రిళ్లు చెమటలు పట్టడం, దగ్గినప్పుడు తెమడలో రక్తం పడటం వంటివి ఉన్నట్లయితే వైద్య సిబ్బందిని సంప్రదించి దగ్గరలోని హాస్పటల్ కు వెళ్లి  వ్యాధి నిర్ధారణ కొరకు తెమడ పరీక్ష మరియు ఎక్స్ రే పరీక్షలు చేయించుకోవాలని ఒకవేళ క్షయ  వ్యాధి  నిర్ధారణ అయితే ఆరు నెలలు క్రమం తప్పకుండా మందులు వాడితే క్షయ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చునని అనుమానితులు త్వరగా నిర్ధారణ పరీక్షలు చేయించుకొని మందులు వాడినట్లయితే ఇతరులకు వ్యాధిని సోకకుండా అరికట్టవచ్చని అన్నారు.

వ్యాధి నిర్ధారణ జరిగితే వ్యాధి పూర్తిగా తగ్గెంత వరకు నిపుణులైన పర్యవేక్షకుల సూచనలు సలహాలతో ఖరీదైన ఉచిత నాణ్యమైన మందులు  క్షయ వ్యాధి గ్రస్తుడు మందులు వాడే కాలానికి పోషకాహార నిమిత్తం నిక్షయ పోషణ యోజన కార్యక్రమం కింద నెల నెల 1000 రూపాయలు రోగి బ్యాంకు ఖాతాలో వేయడం జరుగుతుందని ఇలాంటి సదుపాయాలు ప్రైవేట్ ఆసుపత్రులలో లభించవు కాబట్టి ప్రభుత్వ వైద్యశాలల్ని ఉపయోగించుకుని ఈ సంవత్సరం అంతానికి క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. క్షయవ్యాధి  అనుమానితులను త్వరగా గుర్తించడానికి జిల్లా కలెక్టర్ సహకారంతో అందజేయబడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానం కలిగిన మొబైల్ హ్యాండ్ హోల్డ్ ఎక్స్రే పరికరము ద్వారా ఈరోజు బర్లగూడెంలో మొత్తం 66 మంది అనుమానిత వ్యక్తులకు చాతి పరీక్ష చేసి వారి వద్ద నుండి తెమడ నమూనాలని వ్యాధి నిర్ధారణ కొరకు సేకరించి తెలంగాణ డయాగ్నస్టిక్ పరీక్ష కేంద్రం కొత్తగూడానికి పంపించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆర్ బి ఎస్ కే వైద్యాధికారి డాక్టర్ గోపి లాల్ ఇల్లందు డివిజన్ క్షయ నివారణ అధికారి శంకర్ సూపర్వైజర్ పోరండ్ల శ్రీనివాస్ ఎక్స్ రే టెక్నీషియన్లు వెంకటేశ్వరరావు చిర్ర సాయి ఏఎన్ఎంలు ఇర్ప నాగలక్ష్మి వీసం కమల, అరుణా దేవి, స్రవంతి, స్థానిక పంచాయతీ కార్యదర్శి రమాదేవి, ఆశా కార్యకర్తలు కవిత, హైమావతి, వెంకట నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.