విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
అలంపూర్ ఏప్రిల్ 7: గురుకుల విద్యాలయాల్లో ప్రభుత్వం విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తుందని వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం ఉండవల్లిలోని ప్రభుత్వ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, వంటగది, భోజనశాల, నిల్వ గది, తరగతి గదులను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ...వంట గదిలో ఎల్లప్పుడూ శుభ్రతను పాటిస్తూ, ఆరోగ్యానికి అనుకూలమైన వాతావరణం ఉండేలా సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్టోర్ రూమ్ లో అవసరమైన సరుకులు తగిన మోతాదులో నిల్వ ఉంచాలని, ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం విద్యార్థినులకు పోషకాహారం అందించాలని ఆదేశించారు.
తరువాత విద్యార్థినులతో మాట్లాడిన కలెక్టర్ భోజనం, క్రీడా సమయం, తరగతులు, మరుగుదొడ్ల పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణపై వివరాలు తెలుసుకోగా, విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు బాగా చదివి రాబోయే పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. చదువుతో పాటు క్రీడలపైనా దృష్టి పెట్టాలన్నారు. విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారికి అవసరమైన మార్గదర్శనం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మరుగుదొడ్లు రోజుకు కనీసం రెండు సార్లు శుభ్రం చేయాలని, పాత వస్తువులను తొలగించి పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు., అనుమతి లేని వ్యక్తులను పాఠశాల ప్రాంగణంలోకి అనుమతించకూడదని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో తహసీల్దార్ ధరణీషా, ఎంపీడీఓ తిరుపతయ్య, ప్రధానోపాధ్యాయులు ఎలిజబెత్, పాఠశాల సిబ్బంది,విద్యార్థినులు,తదితరులున్నారు.




