22-06-2025 12:00:00 AM
మన దేశంలో మహిళల ఆరోగ్యం గురించి, అందులోనూ మూత్ర సంబంధిత సమస్యల గురించి దాదాపుగా ఎవరూ మాట్లాడరు అని హైదరాబాద్లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ)కు చెందిన కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సారికా పాండ్యా తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “తెలంగాణలోనూ వేలాది మంది మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ (ఎస్యూఐ). అంటే పొట్ట భాగంపై ఒత్తిడి పడినప్పుడు మూత్రాన్ని ఆపుకోలేకపోవడం. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, నవ్వినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు వీరికి అప్రయత్నంగానే మూత్రవిసర్జన అయిపోతుంది. కానీ చాలా తక్కువమంది మాత్రమే ఈ విషయంలో వైద్యులను సంప్రదిస్తారు. కరీంనగర్ జిల్లాలో 35 ఏళ్లు దాటిన 552 మంది మహిళలను పరీక్షించగా వారిలో 10శాతం
మందికి మూత్ర సమస్యలు ఉన్నాయి. ఇందులో 57 శాతం మంది తమకు పొట్టపై ఒత్తిడి వస్తే మూత్రం ఆగట్లేదని చెప్పారు. అంటే, ఈ ప్రాంతంలో ఎస్యూఐ సమస్య తీవ్రంగా ఉందని తెలుస్తోంది. ఈ సమస్య, దాని పరిష్కార మార్గాల గురించి విస్తృతంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది” అని చెప్పారు. జూన్ 16 నుంచి 22వ తేదీ వరకు ప్రపంచవ్యాప్తంగా ఇన్కాంటినెన్స్ వీక్ జరుపుకొంటున్న సందర్భంగా ఈ విషయం గురించి ఆమె పలు విషయాలు తెలిపారు.
సమస్య సాధారణమే.. పట్టించుకోరు
35 ఏళ్లు దాటిన ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరికి ఎస్యూఐ సమస్య ఉంటుందని ప్రపంచవ్యాప్త పరిశోధనలు చెపుతున్నాయి. తెలంగాణతో పాటు మన దేశంలోని ఇతర ప్రాంతాల్లో అవగాహనరాహిత్యం, పదిమందీ ఏమనుకుంటారోనన్న బెరుకు కారణంగా చాలామంది మహిళలు ఈ లక్షణాలను దాచిపెడతారు. ఫలితంగా వాళ్లు ఇబ్బంది పడుతూ ఒంటరిగా మిగిలిపోతారు.
వ్యాధి నిర్ధారణ, చికిత్స
ఈ వ్యాధి నిర్ధారించడానికి వైద్యపరమైన చరిత్ర, భౌతిక పరీక్షలు, కొన్నిసార్లు యూరోడైనమిక్ స్టడీస్ లాంటి ప్రత్యేక పరీక్షలు చేయాలి. ఎస్యూఐ ఏ దశలో ఉన్నా తగిన చికిత్సతో నయం చేయొచ్చు. ముందుగా బరువు తగ్గించడం, ద్రవాల నిర్వహణ, బ్లాడర్కు ఇబ్బంది కలిగించే పదార్థాలు తినకపోవడం, కొన్నిరకాల వ్యాయామాల ద్వారా కటి కండరాలను బలోపేతం చేయడం, ప్రత్యేకంగా యూరోగైనకాలజీ సంబంధిత ఫిజియోథెరపీ, కొన్ని కేసుల్లో మందులు వాడడం, ఇవన్నీ ఫలితమివ్వని తీవ్రమైన కేసుల్లో అయితే శస్త్రచికిత్సలు కూడా ఉన్నాయి. స్లింగ్ సర్జరీతో దీర్ఘకాలం పాటు ఉపశమనం లభిస్తుంది. దీనివల్ల మహిళలు మళ్లీ సాధారణ జీవనం గడపొచ్చు.
నిశ్శబ్దాన్ని ఛేదించాలి
మూత్ర సంబంధిత సమస్యలు కూడా ఇతర అనారోగ్యాల లాంటివేనని గుర్తించి, వాటి గురించి మాట్లాడేలా మహిళలను ప్రోత్సహించాలి. సిగ్గుతోనో, భయంతోనో ఈ లక్షణాలు చెప్పకపోతే అవి ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉండే వైద్యులు, గైనకాలజిస్టులు ఈ లక్షణాలను గుర్తించడంలో కీలకపాత్ర పోషించాలి. వారు అవసరాన్ని బట్టి యూరాలజిస్టు వద్దకు పంపాలి.
ఎస్యూఐ, యూటీఐ లక్షణాలు ఒకటేనని పొరబాటు
చాలామంది మహిళలు ఎస్యూఐ లక్షణాలను యూటీఐ లేదా వయసు వల్ల వచ్చే ఇతర లక్షణాలలో ఒకటిగా పొరబడతారు. ఇందుకోసం నిపుణులైన వైద్యులు పూర్తిస్థాయిలో పరీక్షలు చేస్తే అది ఎస్యూఐ అవునా కాదా అన్న విషయం తెలుస్తుంది. లీకేజీ ఏ సమయంలో వస్తోంది, ఏ పని చేసినప్పుడు వస్తోందన్న విషయాలను బట్టి వైద్యులు సరిగా చెప్పగలరు. దగ్గుతో కూడిన స్ట్రెస్ పరీక్షలు, లేదా బ్లాడర్ అల్ట్రాసౌండ్ స్కానింగ్తో కూడా ఎస్యూఐని నిర్ధారించవచ్చు.
బీమా సదుపాయం కూడా ఉంది
ఎస్యూఐ చికిత్సలు, ముఖ్యంగా శస్త్రచికిత్సలకు బీమా సదుపాయం ఉంది. వైద్యపరంగా అది తప్పనిసరని నిర్ధారించినప్పుడు వైద్యబీమాతో చేయించుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైద్యబీమాల్లోనూ ఇది కవర్ అవుతుంది.
మానసిక సమస్యలకూ కారణం
ఎస్యూఐ ఉన్నవారికి ఆందోళన, కుంగుబాటు ఎక్కువవుతాయి. దానివల్ల జీవన నాణ్యత దెబ్బతిని, క్రమంగా మానసిక సమస్యలకూ ఇది కారణం అవుతుంది. నలుగురిలో కలవలేకపోవడం, పెళ్లిళ్ల లాంటి కార్యక్రమాలకు వెళ్లలేకపోవడం, చివరకు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనలేకపోవడం లాంటి సమస్యలు ఉంటాయి. దీంతో కుటుంబ సంబంధాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. చాలామంది దీనివల్ల పనులు మానేసుకుంటున్నారు. కొంతమంది బరువు పడితే మూత్రవిసర్జన అవుతుందన్న భయంతో లైంగిక జీవనానికి దూరమవుతున్నారు. ఇది ఒక్కోసారి విడాకులకూ దారితీస్తోంది.
పురుషులూ గమనించాలి
ఇంట్లో మహిళలకు.. వారు తల్లి, భార్య, అక్క, చెల్లి ఎవరైనా కావచ్చు వాళ్లకు ఇలాంటి సమస్య ఉందేమోనన్న విషయాన్ని ఇంట్లో మగవాళ్లు గుర్తించాలి. వాళ్లతో చర్చించాలి. వారికి అవసరమైన తోడ్పాటు అందించాలి. స్వయంగా వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. ఇది కూడా శరీరంలో వచ్చే ఒక రకమైన అనారోగ్యమేనని గుర్తించి దానికి సరైన సమయంలో చికిత్స చేయించాలి. అప్పుడే వారి జీవన నాణ్యత మెరుగుపడుతుంది. అలాగే 35 ఏళ్లు దాటిన మహిళలు సాధారణ వైద్య పరీక్షలకు వెళ్లినప్పుడు వైద్యులు కూడా ఈ లక్షణాలు ఉన్నాయేమో ప్రశ్నించి తెలుసుకోవాలి.
ఎందుకు మాట్లాడరంటే..
చిన్నవయసు నుంచే అమ్మాయిలకు మన శరీరంలోని విషయాల గురించి మాట్లాడకూడదని నేర్పిస్తారు. అందుకే ఇలా దగ్గినప్పుడో.. తుమ్మినప్పుడో లేదా బాగా నవ్వినప్పుడో మూత్రం లీకవుతున్న విషయం గురించి ఎవరికీ చెప్పుకోలేరు. కొన్నిసార్లు సిగ్గు, భయం వారిని ఆపుతాయి. ఇది సామాజికంగా ఇబ్బంది పెట్టే సమస్య కావడంతో చివరకు కుటుంబసభ్యులు, జీవిత భాగస్వాములతో కూడా చర్చించరు. ఇలా మాట్లాడకపోవడం వల్ల చికిత్స వరకు వచ్చే అవకాశాలే తగ్గిపోతున్నాయి. ఈ లక్షణాలను ఎవరికి వారే గుర్తించగలరు. అవి ప్రారంభమైనప్పుడే వైద్యులను సంప్రదిస్తే సాధారణ పరిష్కారాలతోనే సరిపోతుంది. కొంతమంది గుర్తించినా శస్త్రచికిత్స అవసరం అవుతుందన్న భయంతో ఆగిపోతారు.
ప్రధాన కారణాలు కటిసంబంధ కండరాలు బలహీనపడడం వల్ల ఈ సమస్య వస్తుంది. అందుకు కారణాలు
- ఎక్కువసార్లు గర్భం దాల్చి పిల్లలను కనడం
- మెనోపాజ్
- ఊబకాయం
- పెల్విక్ శస్త్రచికిత్సలు
- దీర్ఘకాలంగా వదలని దగ్గు, దీర్ఘకాలంగా మలబద్ధకం
ఎస్యూఐ ఉన్న మహిళలు నీళ్లు తాగరు, నలుగురితో కలవరు, చివరకు నడవడం లాంటి వ్యాయామాలు కూడా మానేస్తారు. దాంతో వారి శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. తెలంగాణలో ముఖ్యంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల మూత్రసంబంధ ఆరోగ్యంపై అవగాహన చాలా తక్కువ. ఇది వయసుతోపాటే వచ్చే సమస్య అని సరిపెట్టుకుని చాలామంది ఎస్యూఐ గురించి మాట్లాడరు. దానికితోడు చిన్న పట్టణాల్లో యూరాలజీ సేవలు అంతగా లేకపోవడంతో అసలు చూపించుకోరు. త్వరగా గుర్తించి తగిన చికిత్స చేస్తే ఈ సమస్య తగ్గి, జీవన నాణ్యత చాలా మెరుగుపడుతుంది. అయితే హైదరాబాద్ లాంటి నగరాల్లో అత్యాధునిక యూరాలజీ సేవలు అందుతున్నాయి. ఏఐఎన్యూ లాంటి చోట్ల మహిళల కోసం ప్రత్యేక సేవలు కూడా అందిస్తున్నారు.