22-06-2025 12:00:00 AM
వానలతో వ్యాధుల ముప్పు పొంచి ఉంది. దోమలు, ఈగల బెడదతోపాటు కలుషిత నీళ్ల కారణంగా రోగాలు ప్రబలుతాయి. వ్యాధులు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యులు సూచించిన వివరాలివి..
వానాకాలం అంటేనే వ్యాధుల కాలం.. వర్షాలతో వాతావరణం చల్లబడటంతో వ్యాధి కారక కీటకాలు, బ్యాక్టీరియా అత్యంత వేగంగా వ్యాప్తి చెంది అంటు వ్యాధులు ప్రబలుతాయి. వీటికి ప్రభాన కారణం కలుషిత నీరు, ఆహారమే. వీటివల్ల వాంతులు, విరేచనాలు, తదితర సమస్యలు తలెత్తి అనారోగ్యం పాలవుతుంటారు. వీటి బారిన పడకుండా ఉండాలంటే సురక్షిత నీళ్లు, తాజా ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.
డెంగ్యూ
డెంగ్యూకి కారణమయ్యే ఈడిన్ ఈజిప్టు దోమ వాన నీటిలో వృద్ధి చెందుతుంది. ఈ దోమ కుట్టిన ఏడు నుంచి ఎనిమిది రోజుల్లో జ్వరం వస్తుంది. ఎముకలు, కండరాల్లో భరించలేని నొప్పి, శరీరంపై ఎర్రటి దద్దర్లు, వాంతులు, వికారం, రక్తంతో కూడిన మలవిసర్జన తదితర లక్షణాలుంటాయి. ప్లేట్లెట్స్ తగ్గిపోయి షాక్ సిండ్రోమ్కు దారి తీసి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
ఫ్లూ
ఈ సీజన్లో ఫ్లూ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారిపై దాడి చేస్తుంది. ముక్కు కారటం, జలుబు, దగ్గు, ఆయాసం ప్రధాన లక్షణాలు.
డయేరియా.. టైఫాయిడ్
కలుషిత నీళ్లు, ఆహారం ద్వారా డయేరియా, కలరా, టైఫాయిడ్, పచ్చకామెర్లు ప్రబలుతాయి. సాల్మనెల్లా టైపీ అనే బ్యాక్టీరియా కారణంగా ఈ వ్యాధి సోకుతుంది.
మలేరియా
ఈ సీజన్లో వచ్చే జబ్బుల్లో అత్యంత సమస్యాత్మకమైనది. ఈ జ్వరానికి కారణమయ్యే ‘ప్లాస్మోడియం’ పరాన్నజీవి ఆడ అనాఫిలస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది. ఇది మురుగు నీటిలో పెరుగుతుంది. మలేరియాలో రెండు రకాలున్నాయి.. ప్లాస్మోడియం వైవాక్స్ (పీవీ), ప్లాస్మోడియం పాల్సీఫారం (పీఎఫ్). వీటిలో పీఎఫ్ అత్యంత ప్రమాదకరం.
తేలికగా జీర్ణమయ్యేవి
వానాకాలం జీర్ణక్రియ నెమ్మదిగా సాగుతుంది. తేలిగ్గా జీర్ణమయ్యే ఆకుకూరలు, సూప్స్, పెరగన్నం, వంటివి తీసుకోవడం ఉత్తమం. తాజా పండ్లు ఆహారంలో భాగం చేసుకుంటే రోగ నిరోధకశక్తి మెరుగుపడుతుంది. దగ్గు, జలుబు, నోటి సమస్యలకు మిరియాల కషాయం, అల్లం రసంలో తేనే కలిపి తాగితే ఉపశమనం లభిస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- వర్షాకాలంలో బ్యాక్టీరియాలు, వైరస్లు మనుషుల మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఎప్పుడు కాచి చల్లార్చిన నీటిని తాగడం మంచిది. గోరువెచ్చని నీరు తాగాలి.
- ఫిల్టర్, వాటర్ ప్యూరిఫైయర్ నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా నీళ్ల బాటిళ్లు తీసుకెళ్లడం మంచిది. రోడ్డు పక్కన లేదా ఎక్కడపడితే అక్కడ ఉన్న నీటిని తాగకండి.
- వర్షాకాలంలో ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. అందుకే వీలైంతవరకు స్ట్రీట్ ఫుడ్ తినడం మానుకోండి. పానీపూరీలు, మసాలా పూరీలు, పావుబాజీ వంటి స్ట్రీట్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
- తినడానికి ముందు చేతులు కడుక్కోవాలి. ఏదైనా తినడానికి ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఈ చిన్న అలవాటు మిమ్మల్ని ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్ నుంచి కాపాడుతుంది.
- పండ్లు, కూరగాయలను ఈ సీజన్లో తప్పకుండా కడగాలి. బండి మీద వర్షపు నీటి కారణంగా బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇంటికి వచ్చిన వెంటనే మంచి నీటితో శుభ్రంగా కడగాలి.
- దోమలు లేకుండా ఉండేలా చూసుకోవాలి. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వస్తాయి. దోమలు కుట్టకుండా ఉండాలంటే దోమతెరలు వాడటం మంచిది. నిద్రపోయేటప్పుడు ఫుల్ స్లీవ్స్ ధరించాలి.
- బయట వాతావరణం చల్లగా ఉంటుంది. కాబట్టి శరీరం వెచ్చగా ఉండేలా మంచి దుస్తులు ధరించాలి.
- పోషకాహారం తినడం మంచిది. విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తినాలి. ఇవి వ్యాధులు రాకుండా నివారిస్తాయి. అంతేకాకుండా చుట్టూ ఉండే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం మంచిది.
- ఇల్లు, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకూడదు.. ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే వాటిని తొలగించండి.
- పచ్చికాయగూరలు తినొద్దు.. వానకాలంలో ఆకుకూరలు అసలు తినకుండా ఉండటమే మంచిది.
వృద్ధాప్యం..
వృద్ధాప్యంలో మానసిక, శారీరక ఇబ్బందులతో సతమతవుతుంటారు. చల్లటి వాతావరణం లో బయటకు రావొద్దు. శరీరం వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. వేడి ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలి.
చిన్నపిల్లలు..
బాల్యంలో సరైన పోషకాహారం తీసుకోకుంటే ఎదుగుదల లోపిస్తుంది. చిన్నారులు ఇష్టపడే వంట చేసి పెట్టాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చేపలు, బీన్స్, గుడ్లు, పాలు ఉండేలా చూసుకోవాలి. రోజంతా నీరు తాగేలా ప్రోత్సహించాలి. చలిని దూరం చేసేందుకు మంకీ క్యాపు ధరించాలి. దోమ తెరలు వాడాలి. ఒళ్లంతా కప్పేలా దుస్తులు ధరించాలి. జలుబు, దగ్గు ఉంటే వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలి.
మహిళల ఆరోగ్యం
ఇంటి పరిసరాల పరిశుభ్రతతోపాటు, ఇంట్లో అన్నిరకాల వస్తువులపై మూతలు ఉండేలా చూసుకోవాలి. సాయంత్రం కాగానే కిటికీలు, తలుపులు మూసివేసి దోమలు రాకుండా చూసుకోవాలి. ఆహారంలో సమతుల్యత ఉండేలా జాగ్రత్త వహించాలి. సరిపోను నిద్ర ఉండేలా చూసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయమం చేయాలి. తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.