కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ నిరసన సభ
తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు
హరీశ్రావు దృష్టికి 22ఏ భూముల సమస్యలు
కౌటాల (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కౌటాల మండల కేంద్రంలో శుక్రవారం నిరసన సభ నిర్వహించారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కాగా, కౌటాల మండలంతో పాటు సిర్పూర్ నియోజకవర్గంలోని రైతులు ఎదుర్కొంటున్న 22ఏ నిషేధిత భూముల సమస్యను మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లారు. భూములు నిషేధిత జాబితాలో ఉండటంతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైతులు ఆయనకు వివరించారు. రైతుల సమస్యలను హరీశ్రావు సానుకూలంగా విని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.






