19 March, 2026 | 12:44 AM

ఎయిర్‌పోర్టులో క్యాబ్ డ్రైవర్ల ధర్నా

31-07-2024 01:52 AM

రాజేంద్రనగర్, జూలై ౩౦: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఊబర్, ఓలా, ర్యాపిడో కార్ డ్రైవర్లు మంగళవారం ఆందోళనకు దిగారు. ఆయా సంస్థల యాజమాన్యాలు వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ.. ఓలా, ఊబర్, రాపిడో సంస్థలు ఎయిర్‌పోర్టులో ఇతర రాష్ట్రాల డ్రైవర్లకు అనుమతి ఇవ్వడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన డ్రైవర్లు చాలా తక్కువ ధరకే పికప్‌లు తీసుకుంటున్నారని మండిపడ్డారు.

గతంలో తమ పనికి తగిన డబ్బులు ఇచ్చిన ఆయా సంస్థలు ప్రస్తుతం తక్కువ డబ్బులు ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టులోని ఫ్రీ పార్కింగ్ వద్ద ధర్నాకు దిగడంతో వాహనాలు భారీగా స్తంభించాయి. ఆర్‌జీఐఏ పోలీసులు డ్రైవర్లకు సర్దిచెప్పే యత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. రాత్రి పొద్దుపోయే వర కు ఆందోళన కొనసాగించారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.