28-06-2025 11:10:42 PM
కనకమామిడి సర్వే నెం. 510లో 3 ఎకరాలు స్వాధీనం
చేవెళ్ల/మొయినాబాద్: ప్రభుత్వ భూములు రక్షణకు మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్ కుమార్ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మొన్న తొల్కట్టలో, నిన్న అజీజ్ నగర్ లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపిన ఆయన శనివారం కనకమామిడి రెవెన్యూలో కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకున్నారు. గ్రామ శివారులో కేతిరెడ్డి మార్గంలో రోడ్డుకు ఆనుకుని ఉన్న సర్వే నెం 510 లో అక్రమంగా ఫెన్సింగ్ వేసి కబ్జా చేస్తున్న సుమారు 15 కోట్ల విలువైన 3 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ తొలగించి, ఫ్రీకాస్ట్ తో నిర్మిస్తున్న రూమ్ పనులను నిలిపివేశారు.
ఈ సమయంలో గొడవకు దిగి విధులకు ఆటంకం కలిగించిన హైదరాబాద్ కు చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి పై కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. స్వాధీనం చేసుకున్న భూమిలో సూచిక బోర్డు ఏర్పాటు చేసి ఫెన్సింగ్ వేస్తామని తహసీల్దార్ తెలిపారు. ప్రభుత్వ భూములు కబ్జా చేయడమే కాదు.. అసైండ్ భూమిని అమ్మినా , కొన్నా పివోటి చట్టం కింద స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. తహసీల్దార్ వెంట గిర్దవర్ రాజేష్, రెవెన్యూ సిబ్బంది మహేందర్ తదితరులు ఉన్నారు.