25-06-2025 01:08:03 AM
టెహ్రాన్/టెల్ అవీవ్/వాషింగ్టన్, జూన్ 24: పశ్చిమాసియా ప్రాంతంలోని ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సాగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 12 రోజులుగా పరస్పర దాడులు చేసుకున్న ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం తెల్లవారుజామున తన సామాజిక మాధ్యమం ‘ట్రూత్’లో ప్రకటించారు.
అయితే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ ఇరాన్, ఇజ్రాయెల్ నిబంధనలు ఉల్లఘించి దాడులు చేసుకోవడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్తో పాటు ఇజ్రాయెల్ కూడా కాల్పుల విరమణను ఉల్లంఘించిందని, ఇజ్రాయెల్ చర్య పట్ల తాను సంతోషంగా లేనని, టెల్ అవీవ్ శాంతించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కాల్పుల విరమణలో భాగంగా తక్షణమే ఇరు దేశాలు యుద్ధాన్ని ఆపాలని కోరారు.
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేయబోదన్నారు. ఇరాన్ గగనతలానికి వెళ్లిన విమానాలు వెనక్కి తిరిగి వస్తాయని.. ఈ మేరకు ఇజ్రాయెల్ తమ పైలెట్లకు ఆదేశాలు జారీ చేయాలని హెచ్చరించారు. కాల్పుల విరమణ కొనసాగుతోందని.. పరస్పర దాడుల్లో ఎవరికి గాయాలు కాలేదని తెలిపారు. అమెరికా దాడులతో ఇరాన్లో పూర్తిగా ధ్వంస మైన అణు కేంద్రాలను వారు ఎప్పటికీ పునర్మించుకోలేరని స్పష్టం చేశారు.
అంతకు ముందు ఖతార్పై ఇరాన్ దాడులను నిశితంగా పరిశీలించిన ట్రంప్ సిట్యుయేషన్ రూమ్లో తన అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. అనంతరం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసిందని, ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయంటూ ట్రంప్ ‘ట్రూత్’ వేదికగా పోస్టు చేశారు. ‘అందరికీ అభినందనలు. ఇజ్రాయెల్, ఇరాన్ పూర్తి కాల్పుల విరమణకు అంగీకరించాయి.
మరో ఆరు గంటల్లో చర్యలు ప్రారంభం కానున్నాయి. 12 గంట ల్లో ఇరాన్, ఇజ్రాయెల్ సీజ్ఫైర్ అమలు చేయనున్నాయి. 24 గంటల్లో దశల వారీగా కాల్పుల విరమణ అమల్లోకి రానుంది. తొలుత ఇరాన్ కాల్పుల విరమణను ప్రారంభించనుంది. అనంతరం ఇజ్రాయెల్ దానిని అనుసరించనుంది. దీంతో 12 రోజుల యు ద్ధానికి ముగింపు పడనుంది. ఒక దేశం కాల్పుల విరమణ పాటించేప్పుడు మరో దేశం శాంతి, గౌరవంతో ఉండాల్సి ఉం టుంది.
ఈ యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగి ఉంటే పశ్చిమాసియా నాశనమయ్యేది. కానీ అలా జరగలేదు. ఖతార్లో అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ‘ఆపరేషన్ బషరత్ అల్ ఫతా’ పేరుతో ప్రతీకార దాడులకు దిగనున్నట్టు ఇరాన్ ముందే హెచ్చరించినందుకు ధన్యవాదాలు.
మా స్థావరాలపై ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లను పూర్తిగా తిప్పికొ ట్టాం.. ఒకటో రెండో అక్కడక్కడా పడ్డాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇకనైనా ఇరాన్ తన పంథాను మార్చుకొని శాంతివైపు అడుగులు వేస్తోందనుకుంటు న్నా. ఇరు దేశాలు యుద్ధానికి ముగింపు పలికాయి’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇరాన్ భీకర దాడులు..
కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని ట్రంప్ పేర్కొన్న కొద్ది సేపటికే ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులకు పాల్పడింది. దక్షిణ ఇజ్రాయెల్లోని బీర్షెవా నగరంపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో ఒక నివాసంపై క్షిపణి పడటంతో నలుగురు చనిపోగా.. పలువురికి తీవ్ర గా యాలయ్యాయి. పదుల సంఖ్యలో భవనా లు, కార్లు ధ్వంసమయ్యాయి.
ఈ దాడుల అనంతరం ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం మొదలైందని ఇరాన్ ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇరాన్ దాడులపై స్పందించిన ఇజ్రాయెల్.. కాల్పుల విరమణ ఒప్పందానికి తూ ట్లు పొడుస్తూ టెహ్రాన్ కేంద్రంగా మరోసారి దాడులకు పాల్పడింది. టెహ్రాన్ సహా పలు ప్రాంతాల్లో క్షిపణలుతో విరుచుకుపడింది. ఇంతలో నాటో సదస్సుకు బయల్దేరిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్..
సీజ్ఫైర్ అమల్లోకి వచ్చినప్పటికీ దాడులు జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ గగనతలంలోకి వెళ్లిన ఇజ్రాయెల్ విమానాలు వెనక్కి రావాలని.. ఆ బాంబులను వేయొద్దని.. అలా చేస్తే తీవ్ర ఉల్లంఘనే అవుతుందని ఇజ్రాయెల్ను హెచ్చరించారు.
అయితే ట్రంప్ వ్యాఖ్యలు చేసిన మరుక్షణమే టెహ్రాన్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించడం గమనార్హం. ఇప్పటివరకు పరస్పర దాడుల్లో ఇరాన్లో 800 మం దికి పైగా మృతి చెందగా.. గాయపడిన వారి సంఖ్య 4వేలు దాటింది. ఇక ఇజ్రాయెల్లో 30కి పైగా మరణించినట్టు ఆ దేశ రక్షణ దళం (ఐడీఎఫ్) ధ్రువీకరించింది.
కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నాం: నెతన్యాహు
ఇరాన్పై తాము అనుకున్న లక్ష్యాలు నెరవేరడంతో పాటు ట్రంప్ చేసిన సమన్వ యంతో ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పం దం ప్రతిపాదనను పూర్తిగా అంగీకరిస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యా హు తెలిపారు. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్ అన్ని లక్ష్యాలను ఇజ్రాయెల్ సాధించింది. ఇరాన్ నుంచి పొంచి ఉన్న అణు, బాలిస్టిక్ క్షిపణుల ముప్పును తొలగించుకున్నాం. ఆ దేశ మిలిటరీ నాయకత్వాన్ని పూర్తిగా దెబ్బకొట్టాం.’ అని పేర్కొంది.
ఖతార్పై దాడులు.. ముందే హెచ్చరించిన ఇరాన్
సోమవారం రాత్రి ఖతార్ రాజధాని దోహాలో అమెరికా సైనిక స్థావ రాలపై ఇరాన్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఖతార్తో పాటు ఇరాక్, కువైట్, బహ్రెయిన్ స్థావరాలపై కూడా దాడులు చేసినట్టు పేర్కొంది. అయితే దాడులు చేసే విషయమై అమెరికాను ఇరాన్ ముందే హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ స్వ యంగా తన ‘ఎక్స్’లో అమెరికాకు హెచ్చరికలు పంపారు. నిజానికి ఖతార్కు ఇరాన్ మంచి మిత్రదేశం.
ఇరా న్ ప్రయోగించిన మిసైల్స్ను కూడా ఖతార్ తమ గగనతలంలోనే నిర్వీ ర్యం చేసింది. తమ స్థావరాలపై దాడి చేయడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా పరిగణిస్తారనుకుం టే.. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యు ద్ధం ముగిసిందంటూ పేర్కొనడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా తమకు భయపడి అమెరికా కాళ్ల భేరానికి వచ్చిందని ఇరాన్ దౌ త్యవేత్త జావెద్ హొస్సోనీ చేసిన వ్యా ఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇరాన్ ఎప్పటికీ లొంగదు: ఖమేనీ
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేయడంపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ఖమేనీ.. ఇరాన్ ఎప్పటికీ లొంగిపోయే దేశం కాదని మరోసారి స్పష్టం చేశారు.
ఇరాన్ చరిత్ర తెలిసిన మా దేశ ప్రజలు ఎవరికి తలవంచరని తెలిపారు. అంతకుముందు ఖతార్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ చేసిన దాడులను ఆయన సమర్థించారు. ‘మాది తుర్కియే దేశమని.. ఎవరి బెదిరింపులకు భయపడం. అమెరికా మా అణు కేంద్రాలపై చేసిన దాడులకు ఇదీ ప్రతీకార చర్య అని పోస్టు చేశారు.