ఈ స్కూళ్లను పట్టించుకోండి!
ఎయిడెడ్ పాఠశాలలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ స్కూళ్లు ప్రస్తుతం నిరాదరణతో మగ్గుతున్నాయి. సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండడంతో విద్యార్థులు కూడా వాటిలో చేరడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ విద్యా సంస్థలలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న సిబ్బంది తమ ఉద్యోగాలు ఎప్పుడు ‘పర్మినెంట్ అయ్యేనా?’ అని కళ్లలో వొత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు.
కాగా, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వున్న వివిధ గురుకుల పాఠశాలలోని విద్యార్థులు కూడా పలు రకాల సమస్యలతో సతమతమవుతున్నారు. ‘ఎఎన్ఎం’లు లేకపోవడంతో అనారోగ్యాలు సంభవించినప్పుడు ఆందోళనలకు గురవుతున్నారు. రోజువారీ డ్యూటీలు చేసేవారికి అదనపు విధి నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ప్రభుత్వం గురుకుల స్కూళ్లపైనా ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరించాలి.
షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్






