12-05-2025 06:35:30 PM
కాటారం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు సిబిల్ స్కోర్ ఆధారంగానే ఎంపిక చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల తెలంగాణ ప్రజా ఫ్రంట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఈరోజు కాటారంలో పత్రికా విలేకరుల సమావేశంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ మాట్లాడుతూ... సిబిల్ స్కోర్ నిబంధన వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బి సి, మైనారిటీ, ఇబీసీ లలో ఉన్న నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రూ.6000 కోట్లతో 5 లక్షల మందికి రుణాలు ఇవ్వాలని నిర్ణయం చేసి, దరఖాస్థులు స్వీకరించిందని అన్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో 16 లక్షల మంది నిరుద్యోగ యువత, నిరుపేదలు, దళితులు, గిరిజనులు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. దరఖాస్థుల స్వీకరణ పూర్తి అయిన తరువాత సిబిల్ స్కోర్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం లబ్ధిదారుల నోట్లో మట్టికోట్టడమే అవుతుందని విమర్శించారు. అంబేద్కర్ అభయహస్తం పేరుతో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతి నిరుపేద దళితునికి రూ.12 లక్షలు పూర్తి సబ్సిడీ రూపెనా ఇస్తామని అన్నారని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఆ పథకం ఊసే లేదని, 1 లక్ష నుండి 4 లక్షల నిబంధనలతో, పేదల బతుకుల్లో ఎలాంటి మార్పు రాదని అన్నారు.
కనీసం రూ.10 లక్షలు వరకు నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధన ఎవరి ప్రయోజనాల కోసమని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయం వలన అనేక మంది పేదలకు ఒక్కరికి కూడా రాజీవ్ యువ వికాసం రుణాలు వచ్చే అవకాశం లేదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సిబిల్ స్కోర్ నిబంధనను ఎత్తివేయాలని పీక కిరణ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబాసి పార్వతి, సహాయ కార్యదర్శి మినుగు నగేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు దారకొండ సూర్యశంకర్ పాల్గొన్నారు.